కళ్లు చిదంబరం ఈ రోజు మరణించారు
- October 19, 2015
గత కొద్ది రోజులుగా రంగస్థల, సినిమా నటుడు కళ్లు చిదంబరం ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఈ రోజు ఉదయం పది గంటలకు వైజాగ్ కేర్ హాస్పటిల్ లో మరణించారు. ఆయన మృతికి వన్ ఇండియా తెలుగు శ్రద్దాంజలి ఘటిస్తూ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది. చిత్ర పరిశ్రమలో వివిధ రకాల పాత్రలను పోషించడానికి విశాఖపట్నం నుంచి వెళ్లిన ఎందరో నటుల్లో చిదంబరమూ ఉన్నారు. అంతకు ముందు ఆయన నాటక రంగంపై మక్కువతో దాదాపు 14 ఏళ్లపాటు సాంస్కృతిక కార్యకలాపాలలో అవిశ్రాతంగా అన్ని ప్రాంతాలూ తిరిగారు. దీని వల్ల ఒక కంటి నరం దెబ్బతిని పక్కకు లాగేయడంతో 36వ ఏట వరకు సాధారణంగా ఉన్న అతని కన్ను పూర్తిగా మెల్లకన్నుగా మారిపోయింది. అలా కలిగినందుకు బాధపడకుండా 'కళ'కు దూరం కాకుండా యథాతథంగా నాటకాలు వేయసాగారు. అప్పట్లో ఆయన పేరు కొల్లూరు చిదంబరం. మొట్టమొదట ప్రసిద్ధ దర్శకులు సత్యానంద్, మిశ్రో తదితరుల బృందాలతో నాటకాలు వేసేవారు. కొద్ది కాలం అనంతరం వాణి ఆర్ట్స్ అసోసియేషన్ పేరుతో వివిధ నాటికలు, నాటకాలను ప్రదర్శించారు. వివిధ పరిషత్లలో పాల్గొని బహుమతులు పొందారు. 1960లో ''భజంత్రీలు'' అనే నాటికలో తొలిసారిగా నటించారు. ఆ తర్వాత బ్రహ్మచారులు నాటికలో నటించారు. తోలు బొమ్మలాట, ట్రీట్మెంట్, పండగొచ్చింది, రైలుబండి, సిప్పొంచింది, గప్చిప్ వంటి నాటికల్లో నటించి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎవ్వనిచే జనించు, వశీకరణం నాటికలు కూడా అతనికి పేరు తెచ్చాయి. 36వ ఏట ఒక కన్ను మెల్ల కన్నుగా మారటడంతో విశాఖపట్నం పోర్టు ట్రస్టులో అసిస్టెంటు ఇంజినీర్ ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. 1987లో ఉద్యోగానికి, కళారంగానికి దూరమై ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ రఘు కళ్లు అనే సినిమా తీయడానికి ప్రయత్నించిన సందర్భంలో అందులో నటించాలని ప్రముఖ దర్శకుడు ఎల్ సత్యానంద్ కోరగా కొల్లూరు చిదంబరం అందుకు అంగీకరించారు. ఆ ఒక్క సినిమాతోనే నటునిగా సత్తా చాటుకున్న కొల్లూరు చిదంబరం కాస్త 'కళ్లు' చిదంబరంగా ఖ్యాతిగాంచారు. అనంతరం ఒక దాని తర్వాత మరొకటిగా సినీ రంగంలో అవకాశాలు రావడంతో 300 వరకు చిత్రాల్లో నటించారు. ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ ఒకటి విడుదల, అమ్మోరు, మనీ, గోవిందా గోవిందా, పవిత్ర బంధం, అనగనగా ఒకరోజు వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కళ్లులో పాత్రకు నంది పురస్కారం, కళాసాగర్ (మద్రాస్) పురస్కారం లభించడం తనకు ఎంతో సంతోషం కలిగిందని చిదంబరం చెబుతుంటారు. ప్రస్తుతం సకల కళాకారుల సమాఖ్య వ్యవస్థాపకునిగా వ్యవహరిస్తూ, నగరంలోని ప్రహ్లాదపురంలో ఆయన నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







