గుజరాత్‌ రాష్ట్రం లో భారీ వరదలు

- July 25, 2017 , by Maagulf
గుజరాత్‌ రాష్ట్రం లో భారీ వరదలు

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్‌ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బనస్కంతా, పతన్‌ జిల్లాలో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ఇళ్లు నీటమునిగాయి. వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. రంగంలోకి దిగిన సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టారు. దాదాపు 25వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బనస్కంతా జిల్లా నుంచి 10వేల మందిని, పతన్‌ నుంచి 9,790. అహ్మద్‌బాద్‌లో 2,800మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. వరదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 'ముంపు బాధితులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 12 బృందాలు, ఆర్మీ బలగాలను బనస్కంతాకు పంపించాం' అని రూపాని అన్నారు. వరద బాధితులను కాపాడేందుకు వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లను ఏర్పాటుచేశారు. వరదల కారణంగా దిల్లీ-అహ్మదాబాద్‌ రైలు మార్గంలో రాకపోకలను నిలిపివేశారు.
కాగా.. రాజస్థాన్‌, పశ్చిమ్‌బంగాలోని కొన్ని ప్రాంతాల్లోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. రాజస్థాన్‌లో వరదల కారణంగా ఇద్దరు మృతిచెందారు. బంగాల్‌లో బీర్భమ్‌, పురులియా, పశ్చిమ మెడ్నిపోర్‌, హూగ్లీ జిల్లాలు నీటమునిగాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com