రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

- August 14, 2017 , by Maagulf
రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

తెలుగు రాష్ట్రాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణాష్టమి సందర్భంగా విజయవాడలోని శ్రీకృష్ణ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. విజయవాడ గులాబీ తోటలోని శ్రీకృష్ణ దేవస్థానానికి భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. విశాఖలోనూ ఆలయాలన్నీ శ్రీ కృష్ణనామస్మరణతో మార్మోగిపోయాయి. చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న జిల్లా పరిషత్‌ శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమిని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. 
తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత ఉన్న హరేకృష్ణ కమల మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నికృష్ణుల వేషధారణలోని పిల్లలు అందరినీ ఆకట్టుకున్నారు. కమల మందిరంలో మూడు రోజుల పాటు జరగనున్న వేడుకల్లో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలక్కుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ చేశారు. 
అనంతపురంలోని ఇస్కాన్‌ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయానికి పోటెత్తిన పిల్లలు, పెద్దలు శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం 30 వేల భక్తులతో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. 
హైదరాబాద్‌ అంబర్‌ పేటలోని ఎల్లెన్‌ కిండర్‌ గార్టెన్‌ స్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో పాల్గొన్న చిన్నారులు రాధాకృష్ణులు, గోపికల వేషాలతో సందడి చేశారు. ఉట్టి కొట్టి, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. మన సంస్కృతిని పిల్లలకు తెలియజెప్పేందుకే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్‌ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com