ఉద్యమనేత గా మారిన మంచు మనోజ్

- August 19, 2017 , by Maagulf
ఉద్యమనేత గా మారిన మంచు మనోజ్

మనోజ్‌ మంచు కథానాయకుడుగా నటించిన చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. అనీషా అంబ్రోస్‌ నాయిక. అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి దర్శకుడు. ఎస్‌.ఎన్‌.రెడ్డి, లక్ష్మీకాంత్‌.ఎన్‌ నిర్మాతలు. సెప్టెంబరు 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. శనివారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. నటి మంచు లక్ష్మీప్రసన్న ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ''మనోజ్‌ ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండే కథల్నే ఎంచుకొంటుంటాడు. ఇది కూడా ఆ తరహా చిత్రమే. ఇందులో తను పోషించిన రెండు పాత్రలకీ న్యాయం చేసేందుకు ఎంతో శ్రమించాడు. తన కష్టానికి తగిన ప్రతిఫలం ఈ చిత్రంతో లభిస్తుందనే నమ్మకం నాకుంది. ప్రచార చిత్రం చాలా బాగుంద''న్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ''నాయకత్వ వైఫల్యాలు సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే విషయాన్ని ఆలోచన రేకెత్తించేలా చెప్పబోతున్నాం. స్వేచ్ఛ కోసం ఓ యువకుడు చేసిన పోరాటం ఇది.

మనోజ్‌ విద్యార్థి నాయకుడు, ఉద్యమనేత పాత్రల్లో కనిపిస్తాడు. తను 20 కిలోల బరువు తగ్గి మరీ నటించడం విశేషం. నాయిక అనీషా రిపోర్టర్‌గా కనిపిస్తుంది. సముద్రం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. రామరాజు ఛాయాగ్రహణం, శివ నందిగమ్‌ సంగీతం సినిమాకి ప్రధాన బలం'' అన్నారు. మనోజ్‌ మాట్లాడుతూ ''నాపై నమ్మకంతో దర్శకుడు రెండు రకాల పాత్రల్ని చేయించారు. ఆయన 1980 నాటి వాతావరణాన్ని, ఇప్పటి పరిస్థితుల్ని ప్రతిబింబించేలా సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది'' అన్నారు. ''సరికొత్త జోనర్‌లో నడిచే ఓ విభిన్నమైన చిత్రం'' అన్నారు నిర్మాత. సౌండ్‌ ఇంజినీర్‌ విక్రమ్‌ బిస్వాస్‌, సంగీతదర్శకుడు శివ నందిగమ్‌ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com