ఆంధ్ర ప్రదేశ్ లో బీసీలు, కాపులు కోసం పెళ్లి ఖర్చులు నిమ్మితం రూ.25 వేలు ఆర్ధిక సహాయం

- August 30, 2017 , by Maagulf
ఆంధ్ర ప్రదేశ్ లో బీసీలు, కాపులు కోసం పెళ్లి ఖర్చులు నిమ్మితం రూ.25 వేలు ఆర్ధిక సహాయం

బీసీలు, కాపుల‌పై సీఎం చంద్ర‌బాబు వ‌రాల జల్లు కురిపించారు. కొత్త‌గా చంద్ర‌న్న పెళ్లికానుక ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. ఆద‌ర‌ణ ప‌థ‌కం ద్వారా బ‌లహీన వ‌ర్గాలకు అత్యంత ఆధునిక ప‌నిముట్లు ఇవ్వాల‌ని డిసైడయ్యారు. అటు బీసీల‌తో స‌మానంగా కాపు విద్యార్ధుల‌కు స్కాల‌ర్‌షిప్‌లు ఇవ్వాల‌ని చంద్రబాబు నిర్ణయించారు.
ఏపీలో బ‌ల‌హీన వ‌ర్గాలు, కాపుల కోసం కొత్త ప‌థ‌కాలు అమ‌ల్లోకి తీసుకొస్తున్న‌ట్లు సీఎం చంద్ర‌బాబు చెప్పారు. బీసీ, కాపు, బ్రాహ్మ‌ణ సంక్షేమ పథ‌కాల అమ‌లుపై స‌మీక్ష నిర్వ‌హించిన బాబు.. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చంద్ర‌న్న పెళ్లికానుక అనే కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణయించారు. ఈ వివాహ కానుక ద్వారా ఒక్కో కుటుంబానికి 25 వేల చొప్పున పెళ్లి ఖ‌ర్చుల‌కు ఇస్తామ‌న్నారు చంద్ర‌బాబు. ద‌శాబ్దాలుగా బీసీలు ద‌గా ప‌డ్డార‌ని...వారిని త‌మ ప్ర‌భుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంద‌న్నారు. ఆదరణ పథకం ద్వారా బలహీన వర్గాల వారందరికీ అత్యంత అధునాతన పనిముట్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. బీసీల ఆర్ధిక పరిస్థితి మెరుగుపరిచేందుకు వృత్తినైపుణ్యానికి శిక్షణనిస్తూ సహాకారం అందజేస్తున్నామని తెలిపారు. బి.సి ఫెడరేషన్ ద్వారా ఐదుగురితో కూడిన గ్రూప్ నకు 10 లక్షల వంతున యూనిట్ ఖరీదుతో స్వయం ఉపాధి పథకాలు చేపట్టే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు సీఎం...
ఇక కాపు విద్యార్ధులందరికీ బీసీల మాదిరిగానే స్కాలర్ షిప్ లు ఇవ్వాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ద్వారా ఎక్కువ మందికి ల‌బ్ది చేకూరేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. సమాజంలో ఆర్ధికంగా అట్టడుగు స్థాయిలో ఉన్న బీసీలకు ఆదరణ పథకం ద్వారా ఇస్తున్న చేయూతతో  ఆయా సామాజిక వర్గాలు బాగుపడాలని,  ఆర్ధిక కార్యకలాపాలు పెరగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కాపు కార్పొరేషన్ కు  వేయి కోట్లు, స్కాలర్ షిప్ లకు 1474 కోట్లు, వసతి గృహాలకు  845 కోట్లు, బీసీ ఫెడరేషన్లకు 300 కోట్లు,  స్వయం ఉపాధికి 366 కోట్లు... మొత్తం  5 వేల కోట్ల‌కు పైగా ఈ ఏడాది సంక్షేమ పథ‌కాల‌కు కేటాయించిన‌ట్లు సీఎం తెలిపారు. ఎక్కడ సంక్షేమ పథకాలు అవసరమవుతాయో... అక్కడ అమలు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. కచ్చితంగా పథకాల ఫలితాలు చివరి లబ్దిదారుని వరకూ చేరాల్సిందేనని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలును తాను తరచూ సమీక్షిస్తానని, ఈ పథకాలు సక్రమంగా అమలు చేయాలని, ఫలప్రదం కావాలని ఆదేశించారు. అభివృద్ధి పథకాల అమలులో మరింత  సమన్వయంతో ముందుకు సాగాలని చంద్రబాబు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com