ప్రపంచం లోనే అత్యంత వేగవంత మైన బుల్లెట్ ట్రైన్ చైనా లో ప్రారంభం

- September 21, 2017 , by Maagulf
ప్రపంచం లోనే అత్యంత వేగవంత మైన బుల్లెట్ ట్రైన్ చైనా లో ప్రారంభం

గంటకు 3 వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలును చైనా ప్రారంభించింది. చైనా రాజధాని బీజింగ్‌ - వాణిజ్య రాజధాని షాంఘై మధ్య ఈ రైలు ప్రయాణించనుంది. ఈ రైలు గరిష్ట వేగం 4 వందల కిలోమీటర్లైనప్పటికీ.. ప్రస్తుతం దీన్ని 3 వందల యాభై కిలోమీటర్లకే పరిమితం చేసింది. రెండు నగరాల మధ్య ఉన్న 13 వందల 18 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం 4 గంటల 28 నిమిషాల్లో పూర్తి చేయనుంది. 

గతంలోనూ 3 వందల యాభై కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లు చైనాలో పరుగులు తీశాయి. అయితే.. 2011లో రెండు బుల్లెట్ రైళ్లు ఢీకొనడంతో 40 మంది చనిపోయారు. అధిక వేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తేలడంతో.. రైళ్ల వేగాన్ని 3 వందల కిలోమీటర్లకు తగ్గించారు అక్కడి అధికారులు. ఇప్పుడు భద్రతా ప్రమాణాలను మరింతగా మెరుగుపరిచి వేగాన్ని పెంచారు.

విమానాలను తలపించే రీతిలో ఈ రైలులో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అన్ని బోగీల్లో వైఫై, మొబైల్ ఛార్జింగ్ పోర్టులు ఏర్పాటు చేశారు. ఇక ఆర్డర్ ఇవ్వగానే కావల్సిన ఆహారాన్ని అందించడానికి ట్రైన్‌ హోస్టెస్‌ను కూడా నిమమించారు. 

అత్యంత వేగంతో వెళ్లినా.. ట్రైన్‌లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి అసౌకర్యమూ ఉండదంటున్నారు అధికారులు. దీన్ని రుజువు చేయడానికి.. ఓ బాటిల్.. ఫోన్.. కాయిన్‌ను విండో దగ్గర పెట్టి చూపించారు. ట్రైన్‌ అత్యంత వేగంతో వెళుతున్నా.. అవి ఏ మాత్రం కదలకుండా ఉండడం అందర్నీ ఆకర్షించింది. ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే... అటోమెటిక్‌గా అది వేగాన్ని తగ్గించుకుంటుంది. 

జపాన్ సాంకేతిక సహకారంతో.. త్వరలోనే మన దేశంలోనూ బుల్లెట్‌ ట్రైన్ పరుగులు తీసే అవకాశం ఉంది. ముంబై - అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ ట్రైన్‌కు ఇటీవలే జపాన్ ప్రధాని షింజో అబే.. భారత ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. 2022 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మనదేశంలో 3 వందల 20 కిలోమీటర్ల వేగంతో.. ఈ ట్రైన్ పరుగులు పెట్టనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com