లతా మంగేష్కర్ పాటల ప్రవాహానికి 88 ఏళ్లు

- September 28, 2017 , by Maagulf
లతా మంగేష్కర్ పాటల ప్రవాహానికి 88 ఏళ్లు

లతా మంగేష్కర్ తన గానంతో భారతావనిని పులకింప జేసింది. ఎన్నో అవార్డులు, రివార్డులు లత కీర్తి కిరీటంలో రత్నాలుగా ఒదిగాయి. ఎన్నో పురస్కారాలు లతను చేరి మరింత గౌరవాన్ని పొందాయి. లతకు భారత రత్న పురస్కారం ఇచ్చి భారత ప్రభుత్వం తనను తాను సత్కరించుకుంది. తన గాన ప్రవాహం 1942లో వచ్చిన మహల్ సినిమాలోని 'ఆయెగా ఆయెగా ఆనేవాలా' అనే పాటతో ప్రారంభమై దాదాపు 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు చిత్రం 'సంతానం'లో 'నిదుర పోరా తమ్ముడా', అలాగే నాగార్జున, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన 'ఆఖరి పోరాటం' లో 'తెల్ల చీరకు' పాట పాడి తెలుగవారి మదిని దోచుకుంది.  'యే మేరే వతన్ కే లోగో'  ఈ గీతం లత గాత్రంలో జాలువారి అమరత్వాన్ని పొందింది.  ఆ పాటతో సాక్షాత్తు ఆనాటి ప్రధాని నెహ్రూ సైతం లతను ప్రశంశించకుండా ఉండలేకపోయారు.  భారత దేశంలోని పలు భాషల్లో లత గళం పల్లవించింది.   

ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్లతో గడిచిపోయింది. అయిదవ ఏటనే తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు సంగీతాన్ని వినడం, పాడడం తప్ప మరో లోకం లేదు. బాల్యంలోనే చదువుకు స్వస్తి చెప్పింది.  ఒకరోజు స్నేహితులకు పాటలు ఎలా పాడాలో నేర్పిస్తుంటే అది విన్న హెడ్మాస్టరు అరిచే సరికి ఆ మర్నాటి నుంచి స్కూలుకు వెళ్లడం మానేసిందట.  పాటే ప్రాణంగా బతికింది.  తన గానమే తనకు ఆరు విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్ డిగ్రీలను తెచ్చి పెట్టింది. నేపథ్య గాయనిగా పలు చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. ఈ రోజు తన 88వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.  ఈ గాన కోకిల నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనఃస్పూర్తిగా కోరుకుందాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com