యూఎస్‌-భారత్‌ సంబంధాలపై చైనా అక్కసు వెళ్లగక్కింది

- October 21, 2017 , by Maagulf

అమెరికా-భారత్‌ మధ్య సత్సంబంధాలపై చైనా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. భారత్‌ ఎదుగుదలను వాషింగ్టన్‌ ఎంతమాత్రం అంగీకరించబోదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు 'చైనా గ్లోబల్‌ టైమ్స్‌' ఓ కథనాన్ని ప్రచురించింది. భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను చైనా ఎంతమాత్రం వ్యతిరేకించదంటూనే.. తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని పేర్కొంది.
'బీజింగ్‌ను ఎదుర్కొనేందుకు భారత్‌ను ఉపయోగించుకోవాలని అమెరికా భావిస్తోంది. భారత్‌-చైనా మధ్య ఉన్న విబేధాలను అడ్డం పెట్టుకొని యూఎస్‌ లబ్ధిపొందాలని అనుకుంటోంది. భారత్‌ ఒకింత ఒత్తిడికి లోనవుతోంది. చైనాతో దూరం పెరిగిపోతోందని ఆ దేశం ఆందోళన చెందుతోంది. వాషింగ్టన్‌ ఏ దేశాన్ని శక్తిమంతంగా ఎదగనివ్వదు, అది చైనా అయినా.. భారత్‌ అయినా కావొచ్చు.' అని కథనంలో పేర్కొంది. భారత్‌-చైనా మధ్య ఇటీవల నెలకొన్న డోక్లామ్‌ ప్రతిష్టంభన సమయంలో కూడా డ్రాగన్‌ అమెరికాను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసింది.
అమెరికాకు భారత్‌ విశ్వసనీయమైన భాగస్వామి.. మరో శతాబ్దమైనా ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని యూఎస్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ రెక్స్‌ టిల్లర్సన్‌ వ్యాఖ్యానించిన రెండు రోజుల వ్యవధిలోనే చైనా తన వక్రబుద్ధి చూపించుకుంది. టిల్లర్సన్‌ బుధవారం భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను ప్రశంసిస్తూనే.. చైనాకు చురకలేశారు. దక్షిణ చైనా సముద్రంపై అధిపత్యం కోసం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆయన తేల్చిచెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com