మధుర ఫలాలు.. సీతాఫలాలు

- October 23, 2017 , by Maagulf
మధుర ఫలాలు.. సీతాఫలాలు

హైదరాబాద్‌లో ఊపందుకున్న సీతాఫలాల అమ్మకాలు

ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్న వైద్యులు

హైదరాబాద్‌, బాలానగర్‌: సీతాఫలాల సీజన్‌ వచ్చేసింది. నగర శివారు ప్రాంతాలు, గ్రామాలకు చెందిన ప్రజలు అడవులు, తోటల నుంచి సేకరించిన మధుర ఫలాలను ఎడ్ల బండ్లలో నగరానికి తీసుకొస్తున్నారు. ప్రధాన కూడళ్లు, రోడ్లు, రైతు బజార్లు, కూరగాయల మార్కెట్ల వద్ద వీటిని అమ్ముతున్నారు. సీజన్‌ వారిగా వచ్చే పండ్లు కావడంతో నగర వాసులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో కాయను ఐదు నుంచి పది రూపాయలకు విక్రయిస్తున్నారు. మరికొందరు డజను, బుట్ట.. వంద రూపాయలపైనే అమ్ముతున్నారు. సీతాఫలాల్లో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు సైతం చెబుతుండడంతో వీటి అమ్మకాలు రోజు రోజుకు ఊపందుకుంటున్నాయి. 
 
సీతాఫలాల్లో ఔషధ గుణాలు  
సీతాఫలం కేవలం రుచికే కాదు, మెరుగైన ఆరోగ్యానికి కావాల్సిన పోషక విలువలు అందులో ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. పండుతో పాటు, గింజలు, ఆకులు, కాండం పువ్వులు అన్నీ ఆరోగ్య ప్రదాయినులే అని అంటున్నారు.  ఆకుల రసాన్ని తాగితే జీర్ణశక్తి పెరుగుదల, కాండం నుంచి తీసిన కషాయాన్ని తాగితే డయేరియా లాంటి జబ్బులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. సీతాఫలం చెట్టు వేరుతో పళ్లు తోముకుంటే పంటి సమస్యలు కూడా పోతాయంటున్నారు. సైన్స్‌ అభివృద్ధి చెందని రోజుల్లో గ్రామాలకు చెందిన ఆయుర్వేదం తెలిసిన వారెందరో సీతాఫలాన్ని ఆరోగ్య ప్రదాయినిగా వినియేగించే వారని వైద్యులు తెలియజేస్తున్నారు. 
 
ఈ పండులో ఉన్న పీచు పదార్థాలు ఆజీర్తిని తగ్గిస్తాయి. దీనిలో అధిక శాతంలో ఉండే మెగ్నీషియం కండరాలను గట్టిపరచడమే కాకుండా గుండెపోటును రాకుండా అడ్డుకోవడంతోపాటు శరీరానికి కావలసిన నీటిని అందిస్తుందని అంటున్నారు. సీతాఫలంలో కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు, కొవ్వు, ప్రొటీన్లు, కాల్షియం, పాస్పరస్‌ తదితర వాటితో పాటు... పోటాషియం.. రక్త ప్రసరణ సరిగా జరిగేట్టు చూస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com