మయన్మార్‌కు సైనిక సాయాన్ని ఉపసంహరించిన అమెరికా ప్రభుత్వం

- October 25, 2017 , by Maagulf
మయన్మార్‌కు సైనిక సాయాన్ని ఉపసంహరించిన అమెరికా ప్రభుత్వం

- రోహింగ్యాలపై అత్యాచారాలకు నిరసన 
మయన్మార్‌కు అందచేస్తున్న సైనిక సాయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా సోమవారం ప్రకటించింది. ఇటీవల రాఖినె రాష్ట్రంలో జరిగిన మారణకాండ పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి హీథర్‌ నారెట్‌ పేర్కొన్నారు. రోహింగ్యా ముస్లింలపై ఇటీవల జరిగిన హింసాకాండ ఫలితంగా దాదాపు 6లక్షల మంది రోహింగ్యాలు దేశం విడిచి పారిపోయారని పేర్కొంటూ, అందుకు కారణమైన వ్యక్తులు లేదా సంస్థలు ఎవరైనా సరే వారు బాధ్యత వహించాల్సిందేనని నారెట్‌ స్పష్టం చేశారు. గత వారం అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌ మాట్లాడుతూ, రోహింగ్యా శరణార్థుల సంక్షోభానికి మయన్మార్‌ ప్రభుత్వమే కారణమని పేర్కొన్నారు. మయన్మార్‌ సైన్యం క్రమశిక్షణతో, సంయమనంతో వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. మయన్మార్‌ సాయుధ బలగాలతో ఇప్పటికే అమెరికాకు పరిమితమైన సంబంధాలు వున్నాయి. అలాగే మయన్మార్‌కు సైనిక విక్రయాలపై దీర్ఘకాలంగా ఆంక్షలు కూడా వున్నాయి. ఇప్పుడు ఆ వైఖరిని మరింత బలపరిచేలా సైనిక సాయాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.

రోహింగ్యాలపై అత్యాచారాలతో సంబంధమున్న వ్యక్తులపై, సంస్థలపై ఆర్థిక ఆంక్షలు విధించాలని యోచిస్తున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. మయన్మార్‌ సీనియర్‌ సైనిక నేతల ప్రయాణాలపై వున్న ఆంక్షలను పరిశీలించడాన్ని కూడా నిలిపివేసినట్లు తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com