లండన్‌లో అమరావతి నమూనాలపై తుది కసరత్తు చంద్రబాబు

- October 25, 2017 , by Maagulf
లండన్‌లో అమరావతి నమూనాలపై తుది కసరత్తు చంద్రబాబు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాల డిజైన్లు నేడు ఫైనల్‌ అయ్యే అవకాశం కనబడుతోంది.. లండన్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నార్మన్‌ ఫోస్టర్‌ అధినేత లార్డ్‌ ఫోస్టర్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి.. రాజధాని డిజైన్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో డైరెక్టర్‌ రాజమౌళి కూడా పాల్గొన్నారు.

అమరావతి నిర్మాణాల డిజైన్లకు తుదిరూపు ఇస్తున్న నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. లండన్‌ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. డైరెక్టర్‌ రాజమౌళితో కలిసి రాత్రి సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాజధానిలో నిర్మించబోయే అసెంబ్లీ, సెక్రటేరియట్‌, హైకోర్టు సహా పలు నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే పలు డిజైన్లు తయారు చేసిన కంపెనీ.. వాటికి కొన్ని మార్పులు చేసింది..

ఈ నేపథ్యంలో కొత్తగా రూపొందించిన డిజైన్లపై నార్మన్‌ ఫోస్టర్‌ అధినేత లార్డ్‌ ఫోస్టర్‌తో చంద్రబాబు, రాజమౌళి నేరుగా సమావేశమయ్యారు. డిజైన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని తీర్చదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు.. నిర్మాణాలు కూడా అదే స్థాయిలో ఉండాలని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు మార్పులు చేర్పులు సూచించారు. తాజాగా రూపొందించిన డిజైన్ల వెనుక కాన్సెప్ట్‌లను నార్మన్‌ సంస్థ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు. నేడు కూడా చర్చించి డిజైన్లను ఫైనల్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం లండన్‌ ట్రాఫిక్‌ వ్యవస్థను పరిశీలించింది. అమరావతిలో అత్యుత్తమ పౌర రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రవాణా విభాగం సెంట్రల్‌ కమాండ్‌ సెంటర్‌ను సందర్శించింది. అక్కడి వ్యవస్థపై లండన్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ శశివర్మ సీఎం బృందానికి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. లండన్‌లో 86 లక్షలకుపైగా జనాభా ఉండగా, ప్రతిరోజూ సెంట్రల్‌ లండన్‌కు 12 లక్షలమంది వచ్చి వెళ్తుంటారని, అక్కడ నివసించేవారి సంఖ్య లక్షమందేనని చెప్పారు. ఆ తర్వాత లండన్‌ నగరంలో 30 లక్షల కెమెరాలతో నిరంతర నిఘా వ్యవస్థను అమలు చేస్తున్న తీరును కూడా వివరించారు. లండన్‌ వీధుల్లో జరిగే ప్రతి కదలికపై కెమెరా కన్ను ఉంటుందని ప్రజెంటేషన్‌లో వివరించారు. ఇక లండన్‌ పర్యటన ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబును భారత డిప్యూటీ హై కమిషనర్‌ దినేశ్‌ కె.పట్నాయక్‌ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా యూరప్, ఇంగ్లండ్ నుంచి అమరావతికి వచ్చి పెట్టుబడులు పెట్టే సంస్థలకు మార్గదర్శనం చేయాలని దినేశ్ కె.పట్నాయక్‌ను చంద్రబాబు కోరారు. అలాగే ఓడరేవులు, అంతర్గత జలరవాణా మార్గాల గురించి వివరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com