నేడే తిరువనంతపురం వేదికగా భారత్‌-కివీస్ మధ్య టీ ట్వంటీ ఫైనల్ ఫైట్

- November 06, 2017 , by Maagulf
నేడే తిరువనంతపురం వేదికగా భారత్‌-కివీస్ మధ్య టీ ట్వంటీ ఫైనల్ ఫైట్

వన్డే సిరీస్ తరహాలోనే రసవత్తరంగా సాగుతోన్న భారత్‌-కివీస్ టీ ట్వంటీ సిరీస్‌లో ఫైనల్‌కు ఫైట్‌కు అంతా సిధ్ధమైంది. తిరువనంతపురం వేదికగా ఇవాళ జరగనున్న ఈ మ్యాచ్‌ సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేయబోతోంది. తొలి మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తుగా ఓడించిన కోహ్లీసేన... రెండో టీ ట్వంటీ మాత్రం అంతే చిత్తుగా ఓడింది. బ్యాటింగ్‌లో కోహ్లీ తప్పిస్తే మిగిలిన వారంతా చేతులెత్తేయడం ఓటమికి కారణమైంది.

ఢిల్లీ టీ ట్వంటీలో అదరగొట్టిన ఓపెనర్లు రెండో మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచారు. కోహ్లీ తప్పిస్తే... మిడిలార్డర్ కూడా విఫలమైంది. ధోనీ చివరి వరకూ క్రీజులో ఉన్నా... జట్టును గెలిపించలేకపోయాడు. అటు బౌలింగ్‌లోనూ స్థాయికి తగిన ఆటతీరు లేకపోవడంతో ప్రత్యర్థి భారీస్కోర్ సాధించింది. ఫీల్డింగ్ తప్పిదాలను సొమ్ము చేసుకున్న మున్రో సెంచరీతో రెచ్చిపోయాడు. దీంతో సిరీస్ డిసైడర్‌లో అతన్ని కట్టడి చేయడంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం చేసిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ భారీగా పరుగులిచ్చుకోవడంతో తుది జట్టులో కొనసాగుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. డెత్ ఓవర్స్‌లో మరోసారి భువి,బూమ్రాలపైనే అంచనాలున్నాయి.

మరోవైపు వన్డే సిరీస్ కోల్పోయినప్పటకీ... టీ ట్వంటీలో మంచి జట్టుగా పేరున్న న్యూజిలాండ్ రెండో మ్యాచ్‌లో ఆకట్టుకుంది.  మున్రో సెంచరీకి తోడు బౌలర్లూ సమిష్టిగా రాణించి టీమిండియాను కట్టడి చేశారు. షార్ట్ ఫార్మేట్‌లో భారత్‌పై ఉన్న రికార్డు వారికి అడ్వాంటేజ్‌. దీంతో మరోసారి సమిష్టి ప్రదర్శనతో కోహ్లీసేనను ఓడించి సిరీస్‌తో స్వదేశం తిరిగి వెళ్ళాలని కివీస్ పట్టుదలగా ఉంది.

ఇక మూడేళ్ళ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కేరళకు తిరగొచ్చింది. తిరువునంతపురంలో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుండడం కూడా ఇదే తొలిసారి. అయితే గత మూడురోజులుగా వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com