ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ సంస్థలు ఆసక్తి
- November 07, 2017
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన పెట్టుబడుల వర్షం కురిపిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫారిన్ కంపెనీలు క్యూ కడుతున్నాయి.. చంద్రబాబుతో భేటీ అయిన యూకే బృందం పలు ప్రతిపాలను ఆయన ముందుంచింది.. మరికొందరు పారిశ్రామికవేత్తలు సంస్థలు నెలకొల్పేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సౌర సాంకేతిక పరిజ్ఞానం, విద్య, మానవ వనరుల సామర్థ్యం పెంపు, ఆతిధ్య, పర్యాటక రంగాలపైనే బ్రిటన్ సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పటికే యూకేకి చెందిన పలు కంపెనీలు విశాఖ కేంద్రంగా పనిచేస్తున్నాయని, మరిన్ని రంగాలలో ఏపీలో విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాయని యూకే మాజీ మంత్రి, విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ బేరొనెస్ సందీప్ వర్మ చెప్పారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన యుకే బృందం కొన్ని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందుంచి చర్చించింది. ఐవోటీ ద్వారా డిజిటల్ సెక్యూరిటీ ఐడీ తయారీకి సంబంధించిన ప్రతిపాదనలను కవి హోల్డింగ్ ఏజీ చైర్మన్ అమర్కవి చంద్రబాబుకు వివరించారు. ఈ సంస్థ ఇప్పటికే విశాఖలో దీనిపై ఫెజెట్టే సంస్థతో కలిసి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తోంది. సెన్సార్లు, బయోమెట్రిక్స్, జీపీఎస్ అనుసంధానంతో ఒక సురక్షిత ఐడీ వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. ప్రాజెక్టు తీరుతెన్నులను పరిశీలించి రాష్ట్ర పోలీస్శాఖ ఉపయోగించుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. మరిన్ని యూకే సంస్థలు ఆంధ్రప్రదేశ్కు రావడంలో సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా వర్మను కోరారు.
ఇక సౌర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నైపుణ్యం పెంపు, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కామన్వెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్టనర్స్ ఛైర్మన్ డాక్టర్ జెఫ్రి క్లెమెంట్స్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఏపీలో మానవ వనరుల సామర్ధ్యం పెంపు కార్యక్రమాల్లో తమ దేశానికి చెందిన సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని ఆయన ముఖ్యమంత్రికి చెప్పారు. భవిష్యత్తు రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు ఏపీలోని వృత్తి నిపుణులకు తగిన శిక్షణ ఇచ్చేందుకు నియో ఎక్స్క్రాఫ్ట్ డైరెక్టర్ ఫరీనా సజ్జాద్ ముందుకొచ్చారు. స్మార్ట్ సిటీ ట్రాన్స్పోర్టు వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రద్దీ ఇబ్బందుల్లేని, కాలుష్య రహిత సురక్షిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖపట్నం ప్రత్యేక ఆర్థిక మండలిలో బయో డీజిల్ యూనిట్ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నామని అద్వైత్ బయో ఫ్యూయెల్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సురేష్.. ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ బృందం సమర్పించిన ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లడానికి అమర్కవి నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. యూకే బృందం అందించిన ప్రతిపాదనలు, సలహాలపై సంతృప్తి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి ప్రపంచంలోని అత్యుత్తమ పద్ధతులను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలన్న ఆలోచనతో పనిచేస్తున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









