సింగపూర్ తెలుగు సమాజం ఎన్నికల్లో కురిచేటి కుటుంబం విజయం

- November 27, 2017 , by Maagulf
సింగపూర్ తెలుగు సమాజం ఎన్నికల్లో కురిచేటి కుటుంబం విజయం

సింగపూర్: 2017-2019 సింగపూర్ తెలుగు సమాజం ఎన్నికల బరిలో కురిచేటి కుటుంబం విజయాన్ని సాధించి తెలుగు ప్రజల ప్రేమాభిమానాలను చూరగొన్నారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి నాయకత్వంలో కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి గెలుపొందగా.. ఆయన భార్య కురిచేటి స్వాతి కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎమ్మార్వో కె.సామిరెడ్డి, జమున కుమారుడయిన జ్యోతీశ్వర్‌రెడ్డి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మంగళంపాడుకు చెందిన బొమ్మిరెడ్డి పార్థివరెడ్డి, రాజేశ్వరమ్మ దంపతులకు జన్మించిన కురిచేటి స్వాతి వివాహబంధంతో ఒక్కటై ఉద్యోగరీత్యా సింగపూర్‌లో ఉంటున్నారు. కొన్నేళ్లుగా సింగపూర్‌లోని ప్రజల స్థితిగతులను తెలుసుకుని వారికి సేవలందించేందుకు నిర్ణయించుకున్నారు. కోటిరెడ్డి కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుని ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటారు. తల్లిదండ్రులకు, జన్మభూమికి పేరు ప్రతిష్ఠలు తెచ్చేలా సింగపూర్‌లో తమ సేవలను అందిస్తామని భార్యాభర్తలిద్దరూ తెలిపారు. 
 
మదనపల్లిలోని జ్ఞానోదయ హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్న జ్యోతీశ్వర్‌రెడ్డి, గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్మీడియట్, మదనపల్లి మిట్స్‌లో, హైదరాబాద్ బండ్లగూడలోని మహవీర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేశారు. మంగలంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదోతరగతి పూర్తి చేసిన కురిచేటి స్వాతి, పద్మావతి జూనియర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంసీఏ పూర్తి చేశారు. విద్యావంతులైన ఈ దంపతులిద్దరూ చిన్నవయస్సులోనే అత్యంత ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని మొదటి విడతలోనే గెలుపొందారు. తమను ఆదరాభిమానాలతో ఈ ఎన్నికల్లో గెలిపించినందుకు సింగపూర్ తెలుగు ప్రజలకు, అధ్యక్షులు కోటిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రజల కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసేందుకు నిరంతరం కృషిచేస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com