మూడు దేశాలు సంయుక్తంగా చేయనున్న 'మిసైల్‌-ట్రాకింగ్‌ డ్రిల్‌'

- December 11, 2017 , by Maagulf
మూడు దేశాలు సంయుక్తంగా చేయనున్న 'మిసైల్‌-ట్రాకింగ్‌ డ్రిల్‌'

సియోల్‌: వరుస క్షిపణి ప్రయోగాలతో అగ్రరాజ్యం అమెరికా సహా పొరుగుదేశాలను రెచ్చగొడుతోంది ఉత్తరకొరియా. ఇప్పటికే తమను తాము అణ్వాయుధ దేశంగా ప్రకటించుకున్న ఉత్తరకొరియా భవిష్యత్‌లో మరిన్ని క్షిపణి ప్రయోగాలు చేసే ప్రమాదం ఉంది. దీంతో ఆ దేశ ఆగడాలను అడ్డుకునేందుకు సిద్ధమైంది అమెరికా. ఇప్పటికే దక్షిణకొరియాతో కలిసి ఐదు రోజుల పాటు భారీ వైమానిక డ్రిల్‌ చేసిన యూఎస్‌.. తాజాగా మరో డ్రిల్‌ చేపట్టింది. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాల గురించి ముందుగానే తెలుసుకునేందుకు దక్షిణకొరియా, జపాన్‌లతో కలిసి సంయుక్తంగా మిసైల్‌-ట్రాకింగ్‌ డ్రిల్‌ ప్రారంభించింది. 

రెండు రోజుల పాటు ఈ డ్రిల్‌ జరగనుంది. ఇందులో భాగంగా మూడు దేశాలకు చెందిన ఏగీస్‌ యుద్ధనౌకలు కొరియా ద్వీపం, జపాన్‌ సమీపంలోని జలాల్లోకి ప్రవేశించాయి. ఉత్తరకొరియా నుంచి వచ్చే శక్తిమంతమైన బాలిస్టిక్‌ క్షిపణుల జాడను పసిగట్టేందుకు ఈ డ్రిల్‌ చేపట్టినట్లు దక్షిణకొరియా రక్షణ శాఖ పేర్కొంది. అమెరికా నుంచి రెండు, జపాన్‌, దక్షిణకొరియా నుంచి ఒక్కోటి చొప్పున యుద్ధనౌకలు ఈ డ్రిల్‌లో పాల్గొన్నాయి. 

నవంబర్‌ 29న ఉత్తరకొరియా శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. హ్వాసంగ్‌-15 పేరుతో ప్రయోగించిన ఈ క్షిపణితో అమెరికా ప్రధాన భూభాగమంతా తమ లక్ష్యం పరిధిలోకి వచ్చిందని ఉత్తరకొరియా హెచ్చరించింది. ఈ చర్యతో ప్రపంచదేశాలు మరోసారి ఉలిక్కిపడ్డాయి. ఉత్తరకొరియా ప్రయోగాన్ని అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com