ఆరో ప్రధాన నగరంగా అమరావతి నిర్మాణం

- November 20, 2015 , by Maagulf
ఆరో ప్రధాన నగరంగా అమరావతి నిర్మాణం

భారతదేశంలో ఆరో ప్రధాన నగరంగా అమరావతి నిర్మాణం జరగబోతోందని మాజీ మంత్రి, టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు.తుళ్లూరులో ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమరావతి నిర్మాణం జరిగే ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. జీవనది ఒడ్డున నిర్మాణం జరుగుతోందన్నారు. లండన్‌ లాంటి నగరంకన్నామిన్నగా రాజధాని ఉంటుందన్నారు. తేన్‌ నది ఒడ్డున లండన్‌ నిర్మాణం జరిగిందని, రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతం అంతకంటే ఉత్తమమైన ప్రాంతమన్నారు. దేశంలో ముంబాయి, బెంగుళూరు, చెన్నై, కలకత్తా, హైద్రాబాద్‌ వంటి ప్రధాన నగరాలకంటే మిన్నగా అమరావతి ఏర్పడబోతోందన్నారు. కృష్ణానది ఒడ్డున గొప్ప నిర్మాణం జరగబోతోందన్నారు. కాకపోతే కొంత సమయం పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతులు కల్పించాల్సి ఉందన్నారు. ఇప్పుడు హైద్రాబాబద్‌లో పడుతున్న తిప్పలు అమరావతిలో ఉండకూడదని అన్నారు. భూమిలేని పేదలకిచ్చే పింఛన్ల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని కోరారు. దయతో పనిచేసి పేద వారిని ఆదుకోవాలని అన్నారు. రాజధానిలో రెవెన్యూ అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు జొన్నలగడ్డ శంకర్‌, ఉప్పలపాటి సాంబశివరావు, జమ్ముల అనిల్‌, కొమ్మినేని నరసింహాస్వామి, జొన్నలగడ్డ వినయ్‌, ఆమర్తి రాకేష్‌, జమ్ముల ప్రతీప్‌, మోదేపల్లి చంద్రశేఖర్‌ కొల్లి నరేంద్ర, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు జొన్నల గడ్డ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com