15 రోజుల్లోనే పెర్మిషన్స్

- January 28, 2018 , by Maagulf
15 రోజుల్లోనే పెర్మిషన్స్

తెలంగాణకు విదేశీ సంస్థలు క్యూ కడుతున్నాయి.. పెట్టుబడులు పెట్టేందుకు తరలివస్తున్నాయి.. తాజాగా దుబాయ్‌కి చెందిన లులూ గ్రూప్‌ అతిపెద్ద మాల్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.. 18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ మాల్‌తోపాటు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్స్‌, కూరగాయల ఎగుమతుల  యూనిట్లను ఏర్పాటు చేయనుంది. దుబాయ్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌.. తన చొరవతో పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. 

మంత్రి కేటీఆర్‌, అబుదాబీకి చెందిన లులూ గ్రూప్‌ చైర్మన్‌ యూసుఫ్‌ అలీ సమక్షంలో ఇరు పక్షాల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం విలువ 2,500 కోట్లు.. ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ద్వారా ఐదువేల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో మూడు నెలల్లో నిర్మాణం ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దుబాయ్‌కి చెందిన మరో కంపెనీ డాక్టర్ బీఆర్ షెట్టి గ్రూప్స్ తెలంగాణలో మూడు ప్రాజెక్టుల నిర్మా ణానికి సుమారు వెయ్యి కోట్ల రూపాయల మేర ఒప్పందాలను కుదర్చుకుంది. మందుల తయారీ, పరిశోధన, వైద్య పరికరాలు, గ్రీన్‌ఫీల్డ్ వైద్యశాలలు, వైద్య, ఇంజినీరింగ్ విద్యాసంస్థల నిర్మాణం కోసం బీఆర్‌ఎస్ వెంచర్స్ ఏర్పాటు చేయనుంది. సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రజలకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో సౌకర్యాలను కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

రిటైల్, ఆహార రంగాల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు కృషి చేస్తున్నామన్నారు. లులూ గ్రూప్‌ సంస్థకు ప్రభుత్వపరంగా మద్దతు, ప్రోత్సాహం ఉంటుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టుల్లో కలిసి పనిచేస్తామని కేటీఆర్‌ చెప్పారు.ఆ తర్వాత ఐసీఏఐ ఆధ్వర్యంలో దుబాయ్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. తెలంగాణలో వ్యాపార, పెట్టుబడుల అవకాశాలు అనే అంశంపై చర్చించారు. రాష్ట్రంలో ఉన్న వనరులను పారిశ్రామికవేత్తలకు వివరించారు కేటీఆర్‌. 

15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అంతకు ముందు దుబాయ్‌లోని భారత రాయబారి నవదీప్‌ సూరిని మంత్రి కేటీఆర్‌ కలిశారు. తెలంగాణకు పెట్టుబడులు రావడానికి సహకరించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com