సంచలనంగా జయప్రద రీ ఎంట్రీ..

- February 22, 2018 , by Maagulf
సంచలనంగా జయప్రద రీ ఎంట్రీ..

గతంలో సినీరంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా చక్రం తిప్పారు జయప్రద. మునుపటిలా ఇప్పుడామె రాజకీయాలలో చురుకుగా పాల్గొనడం లేదు. ముందు ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ సినిమారంగంలోకి రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నారు. తన సమకాలీకులైన జయసుధ, శ్రీదేవి ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ఆదరణను చూరగొంటుండటం కూడా జయప్రదలో స్ఫూర్తిని నింపిందని అంటున్నారు. తనకు ఇంత గుర్తింపును తీసుకుని వచ్చిన సినిమారంగంలో ప్రాధాన్యం ఉన్న పాత్రలలో ఇకపై కొనసాగాలని, అందుకు భాషలతో నిమిత్తం లేకుండా ఓ కళాకారిణిగా తనదైన ప్రత్యేకతను మరోసారి చాటాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళం వంటి వివిధ భాషల సినిమాలలో ఆమె నటిస్తోంది. తెలుగులో ఆమె నటించిన శరభ, సువర్ణసుందరి సినిమాలు ఈ వేసవిలో విడుదల కానున్నాయి. హిందీ, మరాఠి, బెంగాలీ భాషల్లో కొత్త దర్శకులతో కలసి సినిమాలు చేస్తోంది. అంతేకాదు స్టార్‌ హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించేందుకు, స్టార్‌ హీరోల తనయుల సినిమాల్లో తల్లి పాత్రలను చేసేందుకు కూడా ఆమె సంసిద్ధంగా ఉన్నట్లు పరిశ్రమలో అంటున్నారు. వీటితో పాటు తమిళ, మలయాళంలో ఆమె నటించిన సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మలయాళంలో కినర్‌ పేరుతోనూ, తమిళంలో కెని పేరుతోనూ రూపొందిన చిత్రంలో జయప్రద ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా సరిహద్దు రాష్ట్రాల్లో ఉండే నీటి సమస్య ఆధారంగా రూపొందుతోంది. ఇందులో తమిళ వ్యక్తిని పెళ్లిచేసుకున్న కేరళ మహిళగా జయప్రద పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. తను మాత్రమే కాకుండా ఇందులో నాజర్‌, రేవతి, రేఖ, పార్తిబన్‌ వంటి నిన్నటితరం నటీనటులు నటిస్తున్నారు. జయప్రద ఇందులో తిరునల్వేలి జిల్లా కలెక్టర్‌ పాత్రలో నటించారు. దక్షిణాదిలో ఇది తనకు సరైన రీఎంట్రీ అని ఆమె అంటున్నారు. ఈ చిత్రంలో ఎస్పీ.బాలు, జేస్‌దాస్‌ కలిసి అయ్యా సామీ అనే ఓ పాటను పాడారు. ఇదిలావుండగా త్వరలో సొంతగా సినిమాలు కూడా నిర్మించాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద ఈ తడవ ఆమె రీఎంట్రీ సినీరంగంలో సంచలనం కాబోతోందని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com