'తను నేను' రివ్యూ

- November 27, 2015 , by Maagulf
'తను నేను' రివ్యూ

ప్రస్తుతం.. సినిమాల్లో నవతరం ప్రేమ కథల జోరు సాగుతోంది. వారానికో ప్రేమ కథా చిత్రం చొప్పున థియేటర్లలో దిగిపోతున్నాయి. వీటిల్లో కొన్ని.. ప్రేమలో కొత్త కోణాల్ని వెలికితీసే యత్నం చేస్తుంటే.. ఉన్న విషయాన్నే సున్నితంగా.. హృదయాన్ని తాకేలా తెరకెక్కించి మనసుల్ని గెలుచుకొంటున్నవి మరికొన్ని. ఈ రెండిట్లో చాలా వరకు 'కథ' విషయంలో మాత్రంగా శ్రద్ధ చూపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని సన్నివేశాలు అనుకోవడం.. వెంటనే రంగంలోకి దిగి వాటిని పక్కాగా తీయడం.. ఇదే తంతుగా మారుతోందన్న ఆరోపణలున్నాయి.సన్నివేశాల్ని వరుసగా పేర్చుకొంటూ వెళ్తే.. అది సినిమా అయిపోదు. ఆ సన్నివేశాల్లో.. పాత్రల్లో సంఘర్షణ కనిపించాలి. జీవం ఉండాలి. అప్పుడే... సినిమాతో పాటే ప్రేక్షకుడూ ప్రయాణం చేస్తాడు. మరి ఈ ప్రాథమిక సూత్రాన్ని తాజా సినిమా 'తను నేను'లో ఏ మేరకు పాటించారో.. ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్‌ అవుతుందో పరిశీలిద్దాం..కథేంటంటే..కిరణ్‌(సంతోష్‌ శోభన్‌) కాల్‌ సెంటర్‌ ఉద్యోగిగా పని చేసే హైదరాబాదీ కుర్రాడు. అందరితోనూ స్నేహంగా ఉండే మంచోడు. ఇతనికి 'అమెరికా' అంటే పడదు. ఎన్‌ఆర్‌ఐలను బద్ధశత్రువులా భావిస్తుంటాడు. ఆ ధోరణితోనే ఉద్యోగం కూడా కోల్పోతాడు. తన స్నేహితుడి ద్వారా పరిచయమైన కీర్తి(అవికాగోర్‌)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. పెళ్లంటూ చేసుకొంటే తననే చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కీర్తికీ కిరణ్‌ అంటే ఇష్టమే. అయితే ఎప్పటికైనా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడాలన్నది ఆమె ఆశయం. దానికి కారణం.. కీర్తి నాన్న బండ్రెడ్డి సర్వేశ్వరరావు (రవిబాబు). కీర్తి అమెరికా కల తెలుసుకొన్న కిరణ్‌.. కీర్తిని ఇండియాలోనే ఉంచేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు. మరి అతని ప్రయత్నాలు నెరవేరాయా? అసలు కిరణ్‌కి అమెరికాపై పగ ఎందుకు? బండ్రెడ్డి సర్వేశ్వరరావుకి తన కూతుర్ని అమెరికాకి పంపాలని అంత బలమైన కోరిక ఎందుకు? చివరికి కీర్తి- కిరణ్‌ల ప్రేమకథ ఏమైంది? అనేది తెలుసుకోవాలంటే 'తను నేను' చిత్రాన్ని చూడాల్సిందే.ఎలా ఉందంటే..కథానాయకుడికి అమెరికా అంటే పడదు. కథానాయికకేమో అమెరికా వెళ్లడమే ధ్యేయం. ఆ మేరకు సినిమా మొత్తం 'అమెరికా యానం' అనే అంశం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కథలో బలం లేనప్పుడు సన్నివేశాల్ని తీర్చిదిద్దే విధానంలో కొత్తదనం చూపించాలి. ఆ ప్రయత్నంలో దర్శకుడు కొంతవరకూ సఫలీకృతుడయ్యారు. కథని ప్రారంభించిన విధానం బాగుంది. కిరణ్‌ ఆఫీసు సన్నివేశాలు.. విహార యాత్ర.. హోటల్లో బిల్లు కట్టే సన్నివేశం ఇవన్నీ సరదాగా ఉన్నాయి. ప్రతి సన్నివేశంలో వినోదం మేళవించడం బాగుంది. రవిబాబు పాత్రని తెరకెక్కించిన విధానం కూడా నచ్చుతుంది. చిన్న చిన్న సంభాషణలతోనే సున్నితమైన హాస్యం పండించాడు. అయితే ఇదంతా తొలి సగంలోనే..సినిమా ద్వితీయార్థంలో కథాగమనం గందరగోళంగా ఉంటుంది. సినిమాకి బలం అనుకొన్న సర్వేశ్వరరావు 'ఫొటో'కి దండేసి గోడకు వేలాడదీసేశారు. ఈ ప్రేమకథలో సంఘర్షణ పుట్టించే పాత్రను అలా మధ్యలోనే ఎందుకు వదిలేశారో? అనిపిస్తుంది. పైగా కిరణ్‌ 'సాయి కోటి' రాయడం.. అందుకే 'అడ్డు' తొలగినట్లు చూపించడం సరిగా లేదు. కథ మొత్తం రెండు పాత్రల చుట్టూనే తిరుగుతూ.. ఒకే అంశాన్ని ప్రస్తావిస్తుండడం.. చూసిన సన్నివేశాన్నే మళ్లీ చూసిన భావన కలుగుతుంది. ద్వితీయార్థంలో హాస్యం మాయమైపోవడంతో.. పతాక సన్నివేశాల కోసం ఎదురుచూడ్డం తప్ప ప్రేక్షకుడికి మరో ఆలోచన కలగదు.ఎవరెలా చేశారంటే..:సంతోష్‌ శోభన్‌కి ఇదే తొలి చిత్రం. బాలనటుడిగా అనుభవం ఉంది. ఆ మేరకు కెమెరా ముందు చలాకీగా నటించేశాడు. అక్కడక్కడా అవసరాల శ్రీనివాస్‌, నానిల ఛాయలు గుర్తొస్తాయి. అవికాగోర్‌ తన పాత్రకు న్యాయం చేసింది. కొత్త తరహా పాత్ర పోషించిన రవిబాబు మరికాసేపు ఉంటే బాగుండేదనిపిస్తుంది. సత్యకృష్ణన్‌.. కథానాయకుడి స్నేహితులుగా మిగతా నటులు తమ పాత్రల మేరకు నటించారు.సాంకేతికంగా..సన్నీ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో తొలి పాట ఆకట్టుకొంటుంది. గీతాల్లో అక్కడక్కడా మంచి సాహిత్య గుబాళింపులు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్‌లో మార్తాండ్‌ కె.వెంకటేష్‌ కత్తెరకు మరింత పదును పెట్టాల్సింది. కెమెరా పనితనం బాగుంది. ఈ తొలి ప్రయత్నంలో దర్శకుడు కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే మరింత బాగుండేదనిపిస్తుంది.బలాలు..+ మొదటి పాట+ కొన్ని సన్నివేశాలు+ అవికా గోర్‌ నటన- బలహీనతలు- చిత్రం ద్వితీయార్థం- ఎడిటింగ్‌- నత్తనడక కథనంగమనిక: ఈ సమీక్ష.. సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

 'తను నేను'నటీనటులు : సంతోష్‌ శోభన్‌.. అవికాగోర్‌.. రవిబాబు.. సత్యకృష్ణన్‌ తదితరులు.సంగీతం : సన్నీ ఎం.ఆర్‌కూర్పు : మార్తాండ్‌ కె.వెంకటేష్‌కళ : ఎస్‌.రవీందర్‌నిర్మాత, దర్శకత్వం: పి.రామ్మోహన్‌విడుదల తేదీ: 27-11-2015

 

--మాగల్ఫ్ రేటింగ్: 3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com