భారీ మార్పులతో అమరావతి ని చేజిక్కించుకున్న చైనా

- November 29, 2015 , by Maagulf
భారీ మార్పులతో అమరావతి ని చేజిక్కించుకున్న చైనా

సింగపూర్ కంపెనీలు రూపొందించిన నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌ను చైనాకు చెందిన జీఐఐసీ (గిజొ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్) సంస్థ మార్పులు చేస్తోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సీఆర్‌డీఏ అధికారులతో కలిసి ఆ సంస్థ మాస్టర్ ప్లాన్‌కు తుది మెరుగులు దిద్దేక్రమంలో ఉందని తెలిసింది. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వ సంస్థలైన సుర్బానా, జురాంగ్ కంపెనీలు తయారు చేసి ఇచ్చిన విషయం తెలిసిందే. దానిని రాష్ట్రప్రభుత్వం రెండు నెలల క్రితం ఆమోదించింది. ఈ మధ్యకాలంలో ప్రధాని మోడీ చైనా పర్యటనలో అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరిన మీదట చైనాకు చెందిన జీఐఐసీ కంపెనీ ప్రతినిధులు ఇటీవలే బెజవాడకు వచ్చి సీఆర్‌డీఏతో చర్చలు జరిపి వెళ్లారు. అనంతరం కంపెనీకి చెందిన 15 మంది నిపుణుల బందం సీఎం చంద్రబాబు నాయుడుని కలిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కంపెనీ బృందం బెజవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయాన్నే తాత్కాలిక కార్యాలయంగా ఏర్పాటు చేసుకుని మాస్టర్ ప్లాన్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. స్థానిక పరిస్థితులు, ఇతర విదేశీ నగరాల ప్రణాళికలు పరిగణనలోకి తీసుకుని ప్లాన్‌లో లోపాలు, ఇబ్బందులను సరిచేస్తున్నారు. రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, జలవనరులు, విద్యుత్, డ్రెయినేజీ, రోడ్ల వ్యవస్థలు, నివాస సముదాయాలు, టూరిజం తదితర అన్ని అంశాల్లోనూ వారు సింగపూర్ ప్లాన్‌లో మార్పులు ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. ఈ మార్పులను జీఐఐసీ కంపెనీ ప్రతినిధులు ఉచితంగా చేయడానికి ముందుకు వచ్చినట్లు సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో రాజధానిలో చేపట్టే ప్రాజెక్టుల్లో కొన్నింటిని ఈ కంపెనీకి ఇవ్వాలనే ముందస్తు ఒప్పందంతోనే ప్లాన్‌లో మార్పులు చేయడానికి వారు పనిచేస్తున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలతో పాటు చుట్టుపక్కల ఊళ్లలో మౌలిక వసతులకు సంబంధించిన ప్లాన్‌ను సీఆర్‌డీఏ అధికారులు రూపొందిస్తున్నారు. దీన్ని రూపొందించే బాధ్యతను విదేశీ కంపెనీకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అతి తక్కువ సమయంలో ఇంతటి భారీ స్థాయి రాజధాని రూపొందించే సామర్థ్యం భారత్‌కు లేదు కాబట్టి, విదేశీ కంపెనీతో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని సీఆర్‌డీఏ చెబుతోంది. అంతేకాదు ఈ ప్లాన్‌ను జీఐఐసీకి అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకే జీఐఐసీ ఉచితంగా మాస్టర్‌ప్లాన్‌కు మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com