నిర్మాతల మండలిలో నిధులు దుర్వినియోగo..

- December 09, 2015 , by Maagulf
నిర్మాతల మండలిలో నిధులు దుర్వినియోగo..

''నిర్మాతల మండలిలో నిధులు దుర్వినియోగమైన విషయం వాస్తవమే. అయితే ఎంత మొత్తం అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం. పన్నెండేళ్ల కిందటి నుంచి లెక్కల్ని మరోసారి పరిశీలిస్తున్నాం'' అన్నారు నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలిలో రూ. 40 లక్షలకిపైగా నిధుల్ని కాజేశారన్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌లోని నిధుల విషయంలో భారీగా కుంభకోణం జరిగిందని ఇటీవల బయటపడిన నేపథ్యంలో మండలి కార్యవర్గ సభ్యులు మంగళవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నిధుల గోల్‌మాల్‌ విషయంలో థర్డ్‌ పార్టీ వారితో ఆడిట్‌ను నిర్వహించి, గత 12 ఏళ్ళుగా జరిగిన లావా దేవీలపై రిపోర్ట్‌ను సిద్ధం చేస్తున్నాం. కమిటీ మొత్తం కలిసి నిధుల దుర్వినియోగం చేసిందని కొందరు వ్యక్తుల చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. తప్పుడు లెక్కలతో 30 లక్షల రూపాయల నిధుల్ని కాజేశామని కోశాధికారి, అకౌంటెంట్‌ అంగీకరించారు. రెండు నెలల సమయమిస్తే తిరిగి చెల్లిస్తామని వారు చెబుతున్నారు. అయితే ఎంత డబ్బు ఇలా దుర్వి నియోగమయ్యిందో తేల్చడానికి థర్డ్‌పార్టీతో ఆడిట్‌ను నిర్వహిస్తున్నాం. మరో రెండు వారాల్లో పూర్తి నివేదిక వస్తుంది. దోషులుగా తేలిన వారిపై చర్యలను దాసరి నారాయణరావు అధ్యక్షతన ఏర్పాటు చేయబోయే కమిటీ సిఫార్సు చేస్తుంది' అని చెప్పారు. 'ఈ వ్యవహారంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం' అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.సురేష్‌బాబు, కె.ఎల్‌.నారాయణ, సి.కళ్యాణ్‌, అశోక్‌కుమార్‌, ఎం.ఎల్‌.కుమార్‌ చౌదరి, దామోదరప్రసాద్‌, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com