ఎయిరిండియా విమానంలో నల్లులు

- July 20, 2018 , by Maagulf
ఎయిరిండియా విమానంలో నల్లులు

ముంబయి: ప్రభుత్వ విమాయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన విమానంలో నల్లులు ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. దీని వల్ల విమానాలు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. మంగళవారం అమెరికాలోని నీవార్క్‌ నుంచి ముంబయి వచ్చిన విమానంలోని సీట్లకు నల్లులు ఉన్నాయని కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. అమెరికాకు విహార యాత్రకు వెళ్లిన ఓ కుటుంబం తిరుగు ప్రయాణంలో తాము ఎయిరిండియా విమానంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తమ కుమార్తెకు నల్లులు కుట్టడంతో చర్మంపై దద్దుర్లు వచ్చాయని తెలిపారు. అది కూడా బిజినెస్‌ క్లాస్‌లో అని వెల్లడించారు. 'తొలుత విమానం బయలుదేరే సమయంలోనే నా భర్త సీట్లో కీటకం కనిపించగా, సిబ్బందికి చెప్పాము. వారు క్రిమిసంహారక మందు స్పే చేశారు. కానీ తర్వాత సీట్లలో నుంచి చాలా నల్లులు బయటకు వచ్చాయి' అని కశ్మీరా అనే ప్రయాణికురాలు చెప్పారు. నల్లులు కనిపించడంపై విమాన సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. నా భార్యకు, కుమార్తెకు ఎకానమీ తరగతిలో సిబ్బంది సీట్లు ఇచ్చారు.

అవి కూడా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయని కశ్మీరా భర్త ప్రవీణ్‌ ఎయిరిండియాకు ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. సంస్థ సేవలు చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు. మరో ప్రయాణికుడు విమానంలో కీటకాలు తిరుగుతున్న ఫొటోను ట్వీట్‌ చేశారు. గురువారం ఇలాంటిదే మరో ఘటన జరిగింది.

ముంబయి నుంచి నీవార్క్‌ వెళ్లిన ఎయిరిండియా విమానంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఓ పసికందును నల్లులు కుట్టాయి. ఈ ఘటనలపై ఎయిరిండియా స్పందించింది. ప్రవీణ్‌ అనే ప్రయాణికుడికి ఎయిరిండియా క్షమాపణలు చెప్పింది.

నిర్వహణ సిబ్బందికి చెప్పి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. కీటకాలు ఉన్నట్లు ఫిర్యాదులు అందుకున్న రెండు విమానాలను ఒక రోజు పాటు నిలిపేసి వాటిని శుభ్రంచేసి క్రిమిసంహారకాలు స్పే చేశామని, సీటు కవర్లు మార్చామని విమానయాన సంస్థ అధికారి ఒకరు చెప్పారు. ముంబయి-నీవార్క్‌ విమాన సమయంలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com