హైదరాబాద్లో బి-హబ్ ఏర్పాటు
- July 31, 2018
హైదరాబాద్: హైదరాబాద్లో బయోటెక్నాలజీ, బయోఫార్మా రంగానికి ప్రత్యేకంగా బి హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. బయో ఫార్మా, బయోటెక్ రంగాల్లో పరిశోధనలకు ఊతం ఇవ్వడంతో పాటు, తయారీ రంగంలోకి ప్రవేశించి కంపెనీలకు బి హబ్ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. మంగళవారం బేగంపేట కార్యాలయంలో జరిగిన సమావేశంలో బి హబ్ ఏర్పాటుపై మంత్రి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్తో పాటు టిఎస్ఐఐసి విసిఎండి నరసింహారెడ్డి, లైఫ్ సైన్సెస్, ఫార్మా డైరక్టర్ శక్తి నాగప్పన్, ఇతర అధికారులతో మంత్రి చర్చించారు. త్వరలో ఏర్పాటు చేయబోయే బి హబ్ ప్రాజెక్టు కోసం సుమారుగా రూ.60కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పిపిపి విధానంలో ఏర్పాటు చేసే బి హబ్ హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో ఏర్పాటు అవుతుందన్నారు.
బయోఫార్మా రంగంలో పరిశోధనలకు ఊతమిచ్చేలా ఇలాంటి ఇక ప్రత్యేక కార్యాక్రమాన్ని చేపట్టడం దేశంలోనే మొదటిసారి అని, బి హబ్ ఏర్పాటు ద్వారా సుమారు 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశోధనశాలల సౌకర్యాలతో పాటు, పరిశోధనలకు ఉపయోగపడే ఇంక్యుబేటర్ ఒకటి అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రపంచంలో బయో ఫార్మా రంగంలో ముందు వరుసలో ఉన్న కొరియా, చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల స్థాయి పరిశోధన, తయారీ సౌకర్యాలు అందుబాటులో వస్తాయని, దీని ద్వారా స్వదేశీ కంపెనీలకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినట్లవుతుందన్నారు. బి హబ్ ద్వారా బయో ఫార్మా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. బయో ఫార్మా రంగంలో ఇప్పటికే తమ పరిశోధనలను కొనసాగిస్తూ, ఆ తరువాత దశలో ఉత్పత్తి ప్రక్రియలోకి వెళ్లేందుకు ఉండే ఇబ్బందులు, సవాళ్లను అధిగమించేందుకు బి హబ్ సౌకర్యం ఉపయుక్తంగా ఉంటుందని,ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఫార్మా పరిశోదనలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అవసరం అయిన బిజినెస్ ప్లానింగ్, సెల్లైన్ డెవలప్మెంట్, ప్రాసెస్ డెవలప్మెంట్, రిస్క్ అసెస్మెంట్ లాంటి అనేక అంశాల్లో ఉపయోగపడుతుందన్నారు.
భారతదేశ కంపెనీలు బయో ఫార్మా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకునేందుకు తమ విస్తరణ ప్రణాళికల్లో ఉన్న బయో ఫార్మా కంపెనీల ప్రయత్నాలకు మరింత ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుందని మంత్రి తెలిపారు. భారతదేశం లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు, ఆయా కంపెనీలకు తమ విస్తరణ ప్రణాళికల్లో ఎదురయ్యే ఇబ్బందులను ముందే గుర్తించి నిధులతో పాటు అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పించడం, బయో ఫార్మా కంపెనీల విస్తరణకు అత్యంత కీలకమైన అంశం అన్నారు. ఈ దిశగా బి హబ్ తన కార్యకలపాలు కొనసాగిస్తుందన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న బి హబ్లో బయో ఫార్మా స్కేల్ ఆఫ్ ప్రయోగశాలతో పాటు సెల్ లైన్ డెవలప్మెంట్, క్లోన్ సెలక్షన్, అప్స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ డెవలప్మెంట్, స్మాల్ స్కేల్ ప్రోడక్షన్ వంటి అనేక సౌకార్యలు ఫార్మా కంపెనీల ప్రీ క్లినికల్ అధ్యయనాల కోసం అందుబాటులోకి వస్తాయన్నారు.
భారతదేశంలో పాటు ఆసియా ఖండంలోనే ఫార్మా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే 200లకు పైగా కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని, ఈ రంగంలో అనేక పరిశోధనలు చేయడంతో పాటు తమ ఉత్పత్తులను ప్రారంభించాయన్నారు. ఇలాంటి జినోమ్ వ్యాలీలో జాతీయ అంతర్జాతీయ స్థాయి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ కంపెనీలకు అనుసంధానంగా ఏర్పాటు చేయబోయే ఈ కామన్ స్కేల్ ఆఫ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ద్వారా ఆయా కంపెనీలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు పరిశోధనలు నిర్వహించి, వాటి ఉత్పత్తులను తయారు చేసేందుకు వాటిని మార్కెట్ చేసేందుకు సమాయాన్ని తగ్గించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్ ఆఫ్ ఇండియా ఉందని, రానున్న పది సంవత్సరాలలో నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించడంతో పాటు సుమారు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే జినోమ్ వ్యాలీ 2.0, హైదరాబాద్ ఫార్మాసిటీ, మెడికల్ డివైసెస్ పార్ట్, లైఫ్ సైన్సెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ వంటి అనేక కార్యక్రమాల నేపథ్యంలో ప్రస్తుతం తాము చేపట్టనున్న బి హబ్ తమ లక్ష్యాలను అందుకోవడంలో ఉపయోగపడుతుందని మంత్రి కెటిఆర్ తెలిపారు.
లైఫ్ సైన్స్ పోర్టను ఆవిష్కరించిన మంత్రి.
కాగా మంత్రి లైఫ్ సైన్స్కు సంబంధించిన పోర్టల్ను ఆవిష్కరించారు. ప్రభుత్వానికి, పరిశ్రమలకు అనుసంధానికి ఈ పోర్టన్లో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







