చైనాలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ పర్యటన

- September 16, 2018 , by Maagulf
చైనాలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ పర్యటన

చైనా:తెలుగువారు ఏ రాష్ట్రంలో ఉన్నా.. తెలుగు రాష్ట్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారాలని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. చైనా పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ బీజింగ్‌ చైనా తెలుగు అసోసియేషన్‌ సభ్యులతో సమావేశమయ్యారు. చైనాలో ఉంటున్న తెలుగువారంతా ఏపీకి ప్రచారకర్తలుగా మారి.. మీరు పనిచేస్తున్న కంపెనీల్లో రాష్ట్రం గురించి చెబితే రాష్ట్రానికి పరిశమల రాక పెరుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికోసం చైనాలో ఉన్న తెలుగువారంతా కృషి చేయాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నారని.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత చుట్టుముట్టిన సమస్యల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో చాకచక్యంగా అధిగమించి అభివృద్ధివైపు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. దేశంలో చాలామంది నదుల అనుసంధానం గురించి మాట్లాడారు.. కానీ చంద్రబాబు మాత్రమే దాన్ని చేసి చూపారని వివరించారు. పట్టిసీమ ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తి చేశామని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు.

రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లడం వల్లే అనంతపురం జిల్లాకు కియా కార్ల కంపెనీ వచ్చిందని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనా అందరి కంటే ముందుందని... చైనాని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఏపీలో 240 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేశ్‌ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com