మృతుల బంధువులను అమెరికా పంపిస్తాం - కేటీఆర్‌

- January 05, 2019 , by Maagulf
మృతుల బంధువులను అమెరికా పంపిస్తాం - కేటీఆర్‌

ఇటీవల అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన నల్గొండకు చెందిన ముగ్గురు తోబుట్టువుల మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం నిరాకరించడంతో వారి అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నారు. ఇన్ఫెక్షన్‌ తదితర కారణాలతో వారి మృతదేహాలను భారత్‌ తరలించేందుకు అమెరికా ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఈ నెల 12న అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబ సభ్యులను అమెరికా పంపేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లను కలిసి ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, బిషప్‌ లాజరస్‌, మృతుల బంధువులు శుక్రవారం కోరారు. దీంతో వారి బంధువులను ప్రభుత్వ ఖర్చులతోనే అమెరికా పంపేలా ఏర్పాట్లు చేస్తామని వారు హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తెలిపారు.

అమెరికాలో గత నెల 23న జరిగిన అగ్ని ప్రమాదంలో నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం గుర్రపుతండాకు చెందిన తోబుట్టువులు కేతావత్‌ సాత్విక నాయక్‌, సుహాస్‌ నాయక్‌, జోయ్‌సుచిత మృతి చెందిన విషయం తెలిసిందే. కేతావత్‌ శ్రీనివాస్‌, సుజాత దంపతుల ముగ్గురు పిల్లలు అమెరికాలోని కొలిర్‌విల్లి పట్టణానికి పైచదువుల నిమిత్తం వెళ్లారు. క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొని ఓ పాస్టర్‌ ఇంట్లో ఉండగా అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో పాస్టర్‌ భార్యతో పాటు ముగ్గురు విద్యార్థులూ మరణించిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురి మృతదేహాలను ఇక్కడికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు, ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అమెరికాలోని తానా సభ్యులు సంప్రదింపులు జరిపారు. చివరకు వారి సంప్రదాయం, అక్కడి విధివిధానాలతో విద్యార్థుల అంత్యక్రియలను అమెరికాలోనే నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులను అక్కడి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com