అఫ్గాన్‌: 27 మంది తాలిబన్ల హతం

- April 13, 2019 , by Maagulf
అఫ్గాన్‌: 27 మంది తాలిబన్ల హతం

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లోని షెర్జాద్‌ జిల్లాలో భద్రతా బలగాలు.. 27 మంది తాలిబన్లను హతమార్చారని అఫ్గాన్‌ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ ప్రాంతంలోని గవర్నర్‌ కార్యాలయం వద్ద తాలిబన్లు శుక్రవారం సాయంత్రం దాడికి ప్రయత్నించగా, వెంటనే ప్రతిఘటించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని వెల్లడించింది. ఉగ్రవాదులు రెండు కారు బాంబులను పేల్చినట్లు ప్రభుత్వం తెలిపింది. భద్రతా బలగాలు చేసిన దాడిలో మరో 32 మంది ఉగ్రవాదులకు గాయాలయ్యాయని పేర్కొంది. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయని వివరించింది.
నంగర్హార్‌ ప్రాంత గవర్నర్ ఈ ఘటనపై స్పందిస్తూ ఉగ్రదాడిని విఫలం చేసిన భద్రతా బలగాలపై ప్రశంసలు కురిపించారు. 'భద్రతా బలగాలు అత్యంత ధైర్య సాహసాలను కనబర్చారు' అని తెలిపారు. 'తాలిబన్లు తమ దుర్మార్గపు లక్ష్యాన్ని చేరుకోలేరు. వారి దాడుల ప్రణాళికలను విఫలం చేస్తూనే ఉంటాం' అని అప్గాన్‌ రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. తాము అఫ్గానిస్థాన్‌లో దాడులు కొనసాగిస్తూనే ఉంటామని తాలిబన్లు శుక్రవారం ప్రకటన చేశారు. శాంతి కోసం తాలిబన్లతో ఓ వైపు అమెరికా చర్చలు జరుపుతుంటే, మరోవైపు ఆ ఉగ్రవాదులు మాత్రం దాడులకు పాల్పడుతూనే ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com