శుభవార్త.. మరో నెల రోజుల్లో..
- May 14, 2019
ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతు పవానాలు సకాలంలో దేశాన్ని తాకుతాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇందుకు అనుకూల వాతావరణం కనిపిస్తోందని స్పష్టం చేస్తున్నారు. జూన్ 1, 2 తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు. జూన్ 10, 12తేదీల్లోగా రాయలసీమ, తెలంగాణ సరిహద్దుల్ని నైరుతి రుతు పవానాలు తాకే అవకాశాలున్నాయని అంటున్నారు. నైరుతి ప్రవేశించిన వెటనే అన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకోనున్నాయి.
దక్షిణ భారతదేశం వైపు నైరుతి గమనాన్ని డిసెంబరు నుంచి మార్చి 15 మధ్య యూరప్, ఆసియా ఖండాల్లోని దేశాల్లో కురిసే మంచు ఆధారంగా అంచనా వేస్తున్నారు. యూరప్, ఆసియా ఖండాల్లో మంచు ఎక్కువగా కురిస్తే రుతుపవనాల గమనం మందగిస్తుంది. అదే సాధారణ స్థాయిలో ఉంటే చురుకుగా కదులుతాయని అధికారులు చెబుతున్నారు. ఈసారి అక్కడ మంచు సాధారణ స్థాయిలోనే కురిసినందున అనుకున్న సమయానికే రుతుపవనాలు రావొచ్చని అంచనా వేస్తున్నారు. వాతావరణం మరింతగా అనుకూలిస్తే ఒకట్రెండు రోజులు ముందుగానే తిరువనంతపురం తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ గమనాన్ని మే 20వ తేదీలోపు మరోసారి అంచనా వేయాల్సి ఉంటుంది.
నైరుతి రుతుపవనాల రాక దక్షిణార్థగోళం నుంచి మొదలవుతుంది. అవి మే 15-20 తేదీల్లో శ్రీలంక దరిదాపుల వరకు ప్రయాణించి రెండు పాయలుగా విడిపోతాయి. ఒకటి బంగాళాఖాతం మీదుగా అండమాన్ వైపు వెళ్లిపోతుంది. మరొకటి అరేబియా సముద్రం మీదుగా కేరళ తీరాన్ని తాకుతుంది. ఈ రెండింటిలో బంగాళాఖాతంవైపుగా వెళ్లేది ఈ నెల 15-20 తేదీల్లో మొదలవుతుంది. ఆ త ర్వాత వారం, పది రోజుల్లో అరేబియా వైపు మరో పాయ వస్తుంది. ఇప్పటికింకా ఈ ప్రక్రియ మొదలు కాలేదు. ఈ వారంలో కదిలే అవకాశం ఉంది.
ప్రస్తుతం దక్షిణాదిలో ఎల్నినో ప్రభావం కనిపించడంలేదు. దీన్నిబట్టి నైరుతి ఆగమనం సకాలంలోగానీ…అంతకంటే ముందుగానీ ఉంటుందని అధికారులు ఓ అంచనాకు వస్తున్నారు. గతేడాది నైరుతి, ఈశాన్య రుతుపవనాలు రెండు తెలుగురాష్ట్రాలను దెబ్బకొట్టాయి. ఆ సమయంలో వచ్చిన తుపాన్లే దీనికి కారణం. అయితే ఈసారి మాత్రం ఆ పరిస్థితులు ఉండకపోవచ్చంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
మరోవైపు రుతు పవనాలు వచ్చే వరకు ఎండల తీవ్రత అధికంగానే ఉంటుందంటున్నారు. ఈ నెల 15 నుంచి వరుసగా మూడు రోజుల పాటు వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వాయవ్య దిశ నుంచి వచ్చే గాలుల ప్రభావంతో ఈ నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







