అణచివేతకు వ్యతిరేకంగా సూడాన్‌లో ఉద్యమం ఉదృతం..ఘర్షణల్లో ముగ్గురు మృతి

- June 11, 2019 , by Maagulf
అణచివేతకు వ్యతిరేకంగా సూడాన్‌లో ఉద్యమం ఉదృతం..ఘర్షణల్లో ముగ్గురు మృతి

ఖర్తోమ్‌ : సూడాన్‌లో మిలటరీ ప్రభుత్వం అనుసరిస్తున్న అణిచివేత చర్యలను నిరసిస్తూ ప్రతిపక్షాల నేతృత్వంలోని పలు సంఘాలు ఆది వారం సహాయ నిరాకరణను పాటించాయి. మిలటరీ ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె ప్రారంభించాయి. మిలటరీ ప్రభుత్వ అణిచివేత చర్యల్లో 100 మందికిపైగా మృతి చెందడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సమ్మె సందర్భంగా భద్రతా బలగాలతో ఆదివారం జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మరణించారని డాక్టర్స్‌ కమిటీ తెలిపింది. దీంతో ఇటీవల కాలంలో సైన్యం చేపట్టిన అణిచివేత చర్యలో మరణించిన వారి సంఖ్య 117కు చేరుకుంది. మిలటరీ ప్రభుత్వం మాత్రం మృతుల సంఖ్యను 60గా చెబుతూ తగ్గించి చూపే ప్రయత్నం చేసింది. దేశంలో పౌర ప్రభుత్వం ఏర్పడే వరకు సూడాన్‌ నుండి రాకపోకలను రద్దు చేయాలని ఆఫ్రికన్‌ యూనియన్‌ ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో రాజకీయ, సామాజిక వాతావ రణం క్షీణించింది. సూడాన్స్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ (ఎస్‌పిఎ) ఈ సందర్భంగా ఒక ప్రకటన చేస్తూ శాంతి యుతంగా సమ్మె చేస్తూ ప్రతిఘటించడమే అధికారంలో ఉన్న మిలటరీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సరైన మార్గమని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సూడాన్‌ అధ్యక్షుడు ఒమర్‌ హసన్‌ అల్‌ బషీర్‌ రాజీనామా చేసిన నాటి నుండి దేశంలో మిలటరీ పాలన కొనసాగు తున్న సంగతి తెలిసిందే. సైనికుల అణచివేత చర్యల కారణంగా జీవించే హక్కును పరిరక్షించుకోవలసిన అవసరముందని ఎస్‌పిఎ తన ప్రకటనలో పేర్కొంది.

ఐరాస ఖండన 
సూడాన్‌లో హింసాత్మక చర్యలను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ తీవ్రంగా ఖండించారు. సూడాన్‌ పౌరులపై బలప్రయోగాన్ని ఆయన నిరసించారు. పలువురు మృతికి, గాయపడటానికి కారణమైన సైనిక చర్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com