ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ కు పాకిస్తాన్ ఆహ్వానం..!

- November 08, 2019 , by Maagulf
ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ కు పాకిస్తాన్ ఆహ్వానం..!

న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో ఈ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలకు వారధిగా నిలుస్తోంది కర్తార్ పూర్ కారిడార్. పాకిస్తాన్ భూభాగంపై ఉన్న సిక్కుల ప్రప్రథమ గురువు గురునానక్ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని నిర్మించిన ఈ కారిడార్ శనివారం ప్రారంభం కానుంది. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ ను ఆహ్వానించింది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంతకంతో కూడిన ఆహ్వాన పత్రం రవిశంకర్ అందింది.

గురునానక్ 550వ జయంత్యుత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఆయన జన్మస్థలమైన నన్కనా ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది. అలాగే- ఆయన బోధనలను సాగించిన కర్తార్ పూర్ గురుద్వారా అక్కడే ఉంది. నన్కనా, కర్తార్ పూర్ ను సందర్శించడానికి తమకు అవకాశం కల్పించాలని కోరుతూ భారతీయ సిక్కులు చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఇది సాకారమైంది. రెండేళ్ల కిందట భారత్, పాకిస్తాన్ లు సంయుక్తంగా కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణానికి పూనుకున్నాయి. ఈ మధ్యకాలంలో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ.. దాని ప్రభావం మాత్రం కారిడార్ పై పడలేదు. యదాతథంగా పనులు కొనసాగాయి.

గురునానక్ 550 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని కర్తార్ పూర్ గురుద్వారా, నన్కనాలను సందర్శించడానికి వేలాదమంది భారతీయ సిక్కులకు అనుమతి ఇచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం. విదేశాల్లో స్థిరపడిన భారతీయ సిక్కులు సైతం దీన్ని వినియోగించుకోవడానికి అవకాశాన్ని కల్పించింది. కారిడార్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా హాజరు కానున్నారు. ఇదివరకు పాకిస్తాన్ పంపించిన ఆహ్వానాన్ని తిరస్కరించినప్పటికీ.. పంజాబ్ ప్రభుత్వ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించారు. కర్తార్ పూర్ కు వెళ్లే తొలి విడత సిక్కుల ప్రతినిధుల బృందానికి మన్మోహన్ సింగ్ సారథ్యాన్ని వహిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com