అక్రమ బంగారు వ్యాపారం గుట్టు రట్టు

- November 24, 2019 , by Maagulf
అక్రమ బంగారు వ్యాపారం గుట్టు రట్టు

విజయవాడ: నగరంలో సాగుతున్న అక్రమ బంగారు వ్యాపారం గుట్టును పోలీసులు రట్టుచేశారు. ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం విజయవాడకు వస్తోందన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో రూ. 3.18 కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించారు. పట్టుబడ్డ వారిని ముంబైకి చెందిన జయేష్‌ జైన్‌, విజయవాడ ఇస్లాంపేటకు చెందిన పోగుల శ్రీనివాస్‌గా గుర్తించారు. నిందితులు సొంత లాభం కోసం బిల్లులు లేకుండా ముంబై నుంచి బంగారాన్ని తరలిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే వారు ఇప్పటి వరకు ఎంత బంగారం ఈ రకంగా తీసుకొచ్చారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి ముంబైలో మూలాలు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com