సుడాన్:14 మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు

- December 10, 2019 , by Maagulf
సుడాన్:14 మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు

సూడాన్:సూడాన్ దేశంలోని బహ్రీ నగరంలో గల కోబర్ నైబర్‌హుడ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని సలోమీ సిరామిక్ ఫ్యాక్టరీలో ఈ నెల 3న ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో 23 మంది సజీవ దహనమయ్యారు. మరో 130 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో 18 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి ఇండియన్ ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాగా, మంగళవారం నుంచి 14 మంది భారతీయుల మృతదేహాలను సుడాన్ నుంచి స్వదేశానికి పంపించనున్నారు. ఈ మేరకు భారత దౌత్యకార్యాలయం ఇప్పటి వరకు గుర్తించిన 14 మంది మృతుల వివరాలను తెలుపుతూ సోమవారం ఒక ట్వీట్ చేసింది. ఎంబసీ అధికారులు గుర్తించిన 14 మంది మృతుల్లో ఇద్దరు(హర్యానా), ముగ్గురు(బీహార్‌), ముగ్గురు(రాజస్థాన్), ముగ్గురు(యూపీ), ఇద్దరు(తమిళనాడు), ఒకరు(పుదుచ్చేరి) వాసులు ఉన్నారు.


హర్యానా నుంచి ప్రదీప్ కుమార్, పవన్ కుమార్... బీహార్ నుంచి నితీష్ మిశ్రా, నీరజ్ కుమార్ సింగ్, అమిత్ కుమార్ తీవారి... రాజస్థాన్ నుంచి రవీంద్ర కుమార్ మాన్, జైదీప్, కైలాష్ కాజ్లా... యూపీ నుంచి మోహిత్ కుమార్, ప్రదీప్ కుమార్ వర్మ, హరినాథ్ రాజ్‌బాహార్... తమిళనాడు నుంచి రామక్రిష్ణ రామలింగం, జయకుమార్ సెల్వరాజు... పుదుచ్చేరికి చెందిన వెంకటచలం చిదంబరం ఉన్నారు. మరో ఎనిమిది మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, అలాగే మరో 11 మంది ఆచూకీ లేదని శుక్రవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) పేర్కొంది. ఎంఈఏ ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ ప్రమాద సమయంలో మొత్తం 58 మంది భారతీయ కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నారని, వీరిలో 33 మంది సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు. ఇక ఈ ప్రమాదంపై గత వారం సూడాన్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం గ్యాస్ ట్యాంకర్లో సంభవించిన భారీ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయని వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com