హ్యూమన్ ట్రాఫికింగ్ వలన నష్టపోయిన గల్ఫ్ కార్మికుడు

- February 19, 2020 , by Maagulf
హ్యూమన్ ట్రాఫికింగ్ వలన నష్టపోయిన గల్ఫ్ కార్మికుడు

తెలంగాణ:జగిత్యాలకు చెందిన తంగెళ్ల గంగారాం, తంగెళ్ల సత్యం అనే ఇద్దరు గల్ఫ్ ఏజెంట్లు తమ వద్ద రూ.65 వేలు తీసుకొని కొక్కెరకాని  పోశన్నను దుబాయ్ కి విసిట్ వీసా పై పంపి మోసం చేశారని  పోశన్న భార్య కొక్కెరకాని గంగాజల బుధవారం  (19.02.2020) జగిత్యాల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 

ఇటీవల దుబాయ్ లో పక్షవాతానికి గురై స్వదేశానికి తిరిగివచ్చిన తన భర్త వైద్య ఖర్చులు పొందలేకపోవడానికి కారకుడైన గల్ఫ్ ఏజెంట్లపై తగిన చర్య తీసుకొని తమకు న్యాయం చేయాలని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామానికి చెందిన కొక్కెరకాని గంగాజల అనే గల్ఫ్ బాధితుడి భార్య ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల తో కలిసి బుధవారం జగిత్యాల కలెక్టరేట్ కు వచ్చారు. జిల్లా కలెక్టర్ తోపాటు  విదేశీ వ్యవహాల మంత్రిత్వశాఖకు  చెందిన ఢిల్లీలోని  ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిజిఇ), హైదరాబాద్ లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఇ) కు కూడా ఫిర్యాదులు పంపారు. 

విసిట్ వీసా పై పంపడం వలన ఇ-మైగ్రేట్ సిస్టంలో పేరు నమోదుకాక రూ.10 లక్షల ప్రవాసి భారతీయ భీమా పాలసీ జారీ కాలేదని గల్ఫ్ బాధితుడి భార్య గంగాజల ఆరోపించింది. చట్టబద్దంగా ఎంప్లాయిమెంటు వీసా పై ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ చేసి పంపిఉంటే రూ.1 లక్ష విలువైన  వైద్య సహాయం లభించి  ఉండేదని ఆమె అన్నారు. 

కొక్కెరకాని పోశన్న ఇసిఆర్ పాస్ పోర్ట్ కలిగి ఉండి, ఆర్డినరీ లేబరర్  వీసా కలిగి ఉన్నాడు కాబట్టి.. చట్టబద్దంగా రూ. 10 లక్షల విలువైన 'ప్రవాసి భారతీయ భీమా యోజన' అనే ప్రమాద భీమా పాలసీ పొందడానికి అర్హత ఉన్నదని ప్రవాసి మిత్ర లేబర్  యూనియన్ అధ్యక్షులు స్వదేశ్  పరికిపండ్ల అన్నారు. చట్టబద్దంగా వ్యాపారం చేయాల్సిన లైసెన్సు  కలిగిన గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీలు 'విసిట్ కం ఎంప్లాయిమెంటు' పద్దతిలో  మానవ అక్రమరవాణాకు పాల్పడటం ఘోరమని ఆయన అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com