డిఫరెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ `22`సినిమా--మ్యూజిక్ డైరెక్టర్

- February 23, 2020 , by Maagulf
డిఫరెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ `22`సినిమా--మ్యూజిక్ డైరెక్టర్

`పటాస్`,`సుప్రీమ్`,`ఈడో రకం..ఆడో రకం`,`రాజుగారి గది` వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌కు స్వర సారధ్యం వహించి సినీ ప‌రిశ్ర‌మ‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యువ సంగీత దర్శకుడు సాయి కార్తీక్. ప్రస్తుతం ఆయన సంగీత దర్శకత్వం వహిస్తున్న చిత్రం `22`. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా ఈ చిత్రం రూపొందుతోంది. ఫిబ్రవరి 23 సాయి కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా యువ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఇంటర్వ్యూ.

22 మూవీ ఎలా ఉండబోతుంది?
-  నేను చేస్తున్న మొదటి యాక్షన్ థ్రిల్లర్ సినిమా `22'. బి.ఎ రాజు గారి అబ్బాయి శివ దర్శకుడిగా పరిచమవుతున్నారు. రూపేష్ కుమార్ చౌదరి హీరో.  కాన్సెప్ట్ చాలా బాగుంది.  ఆర్ ఆర్ చేస్తున్నప్పుడు సినిమా చూసి చాలా థ్రిల్ అయ్యాను. శివ ఎక్స్ట్రార్డినరీ గా తీశాడు.  ఒక కొత్త తరహాలో సినిమా ఉంటుంది.  తప్పకుండా హీరోగా రూపేష్ కు, దర్శకుడి గా శివకు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది.  డెఫినెట్ గా మంచి హిట్ అవుతుంది.


సంగీతానికి ఎంతటి ప్రాముఖ్యత ఉంది?
యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే థ్రిల్లర్ సబ్జెక్టు కాబట్టి సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉంది. ఈ సినిమాకి వర్క్ చేస్తుంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి  ఎక్కువ స్కోప్ ఉంది. హీరో, హీరోయిన్స్  ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కాబట్టి మంచి ఎలివేషన్స్ కుదిరాయి.

 

సినిమాలో ఎన్ని పాట‌లున్నాయి?
-డిఫరెంట్ క్రైమ్ కంటెంట్‌తో వస్తున్న ప్రాజెక్టులో మూడు పాటల్ని దర్శకుడు శివ డిజైన్ చేశాడు. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసిన`మార్ మార్ కే` సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.  మదర్ సెంటిమెంట్‌తో సాగే మరో పాటకి కూడా  ఔట్ స్టాండింగ్  రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నా.


ఈ పుట్టిన‌రోజు స్పెష‌లేంటి?
- స్పెష‌ల్ అంటూ ఏమీ లేదండి.. 22 యూనిట్ తో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.  ఇది నా 37వ పుట్టినరోజు. నా తొమ్మిదవ ఏట నుండే రిథిమ్ ప్లేయర్‌ గా పనిచేశాను. తరువాత విజయ్ ఆనంద్ గారి దగ్గర నుండి దేవిశ్రీ ప్రసాద్ వరకు చాలా మంది సంగీత దర్శకుల దగ్గర డ్రమ్మర్‌గా పనిచేశాను. తరువాత నేను కంపోజర్‌గా మారి పరిశ్రమలో పదేళ్ల కెరీర్ పూర్తయింది. ఇప్పటివరకూ దాదాపు 75 సినిమాలకు సంగీతం సమకూర్చాను. "నాలో చిలిపి కలా.. నీలా ఎదురైందా" పాట నాకు మంచి గుర్తింపునిచ్చింది. ఇప్పటికి దాదాపు 70 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ పాట ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇంకా మంచి పాటలందించాలన్న నిశ్చయంతో వున్నా. .

ప‌దేళ్ల కెరీర్ ఎలా అనిపిస్తుంది?
- టెక్నీషియ‌న్‌గా చాలా హ్యాపీగా ఉన్నాను. కెరీర్ పరంగా నాకు సంగీతం మాత్రమే తెలుసు అదే రంగంలో ఉన్నాను. హిట్ కొడితేనే అవకాశాలు వస్తాయి అంటారు. నా విషయంలో అలా లేదు. హిట్, ఫ్లాఫ్‌లతో సంబంధం లేకుండా పదేళ్లుగా కెరీర్ నడుస్తోంది. నా వరకు ప్రతి సినిమాకు బెస్ట్ ఇస్తూనే వచ్చాను. నేను న్యాయంగా పనిచేస్తాను. ఇక్కడ టైమ్, అదృష్టం ముఖ్యం.  2014 నుంచి 16 వరకూ మూడేళ్లలో 36 సినిమాలు చేసే అవకాశం దొరికింది. 

సాంగ్స్‌పై ఆడియెన్స్ అభిరుచి ఎలా ఉంది?
- ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా  పాటలకు మంచి గుర్తింపు లభిస్తోంది.  టెక్నాలజీ అప్‌డేట్ అవుతూనే ఉంది. ఎన్నో మార్పులు చూస్తున్నాం. గతంలో ఏదైనా ఒక మార్పు చోటు చేసుకోవాలంటే ఐదేళ్లు పట్టేది. ఇపుడు రెండు, మూడు నెలల్లో మారిపోతోంది . నాకు మెలో డీస్ అంటే చాలా ఇష్టం.   అయితే ఎక్కువ మెలోడీలు చేసే అవకాశం రాలేదు. 22లో మంచి మెలోడీగా  మదర్ సెంటిమెంట్ సాంగ్ చేశా. అది ఎంత బాగా వచ్చిందంటే ప్రతి సంవత్సరం మదర్స్ డే కి ఈ పాట ప్లే అవుతుంది.  త్వరలో మీరు వింటారు. 


ఇత‌ర సంగీత ద‌ర్శ‌కుల‌తో మీ అనుబంధం ఎలా ఉంటుంది?
- మణిశర్మ వద్ద నేను, తమన్, వాళ్లబ్బాయి సాగర్ ముగ్గురం జర్నీ చేశాం. మంచి పాటలు చేసినపుడు ఒకరికొకరు వినిపించుకుని చర్చిస్తాం. అందరం క్లోజ్‌గానే వుంటాం.


త‌దుప‌రి చిత్రాలు?
-  ప్రస్తుతం ఏకే ఏంటర్‌టైన్‌మెంట్స్‌తో `బంగారు బుల్లోడు`సినిమా చేస్తున్నా. నరేష్ తో ఒక  ప్రాజెక్టు, కొత్త హీరోతో మరొకటి, అలాగే కన్నడంలో రెండు సినిమాలతో బిజీగా వున్నా. అంటూ ఇంటర్వ్యూ ముగించారు యువ సంగీత దర్శకుడు సాయి కార్తిక్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com