కలిసికట్టుగా వారిని అభినందిద్దాం:ఉప రాష్ట్రపతి

- March 21, 2020 , by Maagulf
కలిసికట్టుగా వారిని అభినందిద్దాం:ఉప రాష్ట్రపతి

ఢిల్లీ:కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఉద్దేశించిన జనతా కర్ఫ్యూలో భారతీయులంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జన సమూహాలకు దూరంగా ఉండటం ద్వారానే దీనికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందన్నారు. సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకే ప్రధాని మోదీ ‘జనతా కర్ఫ్యూ’కు పిలుపునిచ్చిన విషయాన్ని వెంకయ్యనాడు గుర్తు చేశారు. కరోనా వైరస్ రూపంలో దేశం ఎదుర్కొంటున్న ఈ విపత్తును ఎదుర్కోవడంలో రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు, ప్రజలందరూ సంయుక్తంగా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

భారత దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించడం ప్రజలు, ప్రజాప్రతినిధుల సంయుక్త బాధ్యత అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. సెలవు కదా అని కుటుంబసమేతంగా ఇతర ప్రదేశాలకు వెళ్లాలన్న ఆలోచనలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం భారత దేశవ్యాప్తంగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అత్యవసర విభాగాల సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సేవలందిస్తున్న వారి శ్రమ, ధైర్యాన్ని మనం గుర్తించాలని ప్రజలకు సూచించారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దామని.. ఇది వారికి మనోధైర్యాన్ని, కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com