చైనా ను మళ్ళీ కలవరపెడుతున్న కరోనా
- April 11, 2020
వూహన్ : నోవల్ కరోనా వైరస్ గురించి ఇప్పటికీ అర్థం కావడం లేదని చైనా వైద్యులు వాపోతున్నారు. కొత్తగా కోవిడ్-19 కేసులు నమోదవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం విదేశాల నుంచి వచ్చినవారేనని అధికారులు తెలిపారు. ఈ వైరస్ మొదట కనిపించిన వూహన్లోనే ఈ కొత్త కేసులు నమోదయ్యాయి.
నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోదించేందుకు చైనా జనవరి నుంచి కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. ఫిబ్రవరి నుంచి ఈ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే విదేశాల నుంచి చైనాకు వస్తున్నవారి వల్ల మళ్ళీ రెండోసారి ఈ వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని చైనా అధికారులు భయపడుతున్నారు. విదేశాల నుంచి వచ్చేవారికి మొదట్లో ఈ వైరస్ సోకిన లక్షణాలు కనిపించకపోవడం వల్ల, గుర్తించడం కష్టమని చెప్తున్నారు.
కోవిడ్-19 రోగుల కోసం వూహన్లో ఏర్పాటు చేసిన లీషెన్షన్ హాస్పిటల్ ప్రెసిడెంట్ వాంగ్ జింఘువాన్ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఈ వైరస్ సోకిన లక్షణాలు పైకి కనిపించకపోతే, అటువంటి ప్రయాణికుల వల్ల రెండోసారి వైరస్ విజృంభణ జరిగే అవకాశం లేదని చెప్పలేమన్నారు. అయితే రెండోసారి భారీ స్థాయిలో ఈ విజృంభణ ఉంటుందని నిపుణులు భావించడం లేదన్నారు. దీనికి కారణం చైనా అమలు చేస్తున్న కఠినమైన ఆంక్షలేనని చెప్పారు. అయితే నిర్లక్ష్యంగా ఉండకూడదని తెలిపారు. ఇప్పటి వరకు ఈ వైరస్ గురించి మనకు ఉన్న అవగాహన చాలా తక్కువ అని తెలిపారు.
వూహన్లోని ఝోంగ్నన్ హాస్పిటల్ డాక్టర్ ఝావో యాన్ మాట్లాడుతూ నోవల్ కరోనా వైరస్ ప్రవర్తన చైనాలో ఒక విధంగానూ, యూరోపు, అమెరికాలలో మరొక విధంగానూ ఉందన్నారు. అమెరికా, యూరోపుల్లో ఈ వైరస్ సోకినవారిలో చాలా మంది రుచి, వాసన చూడలేకపోతున్నారన్నారు. చైనాలో అటువంటి కేసులు చాలా తక్కువగా కనిపించాయన్నారు.
చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం 46 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వీరిలో 42 మంది విదేశాల నుంచి వచ్చినవారే. గురువారం నమోదైన కొత్త కేసులు 42. హుబే ప్రావిన్స్లో వరుసగా ఏడో రోజు కొత్త కేసులు నమోదు కాలేదు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







