భాష,సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత:ఉపరాష్ట్రపతి
- July 24, 2020
- ఈ రెండింటినీ విడదీసి చూడలేం
- ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా అందరమూ ఒక్కటేనన్న భావనను ప్రతిబింబించాలి
- ఈ దిశగా తానాతోసహా పలు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న కృషికి అభినందనలు
- కరోనా నేపథ్యంలో సామాజిక దూరం, ఆరోగ్యకర సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి
- ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాల’ ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి
ముప్పవరపు వెంకయ్యనాయుడు
భాష,సంస్కృతులు ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్నికలిగి ఉంటాయని..వీటికి విడదీసి చూడలేమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుపేర్కొన్నారు.ఇలాంటి తల్లిభాషను, సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు,తర్వాతి తరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు.
న్యూ ఢిల్లీ:ఉత్తరమెరికా తెలుగుసంఘం (తానా) ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాల’ను ఆన్లైన్ ద్వారా శుక్రవారం ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘మానవ సంబంధాల అభివృద్ది క్రమంలో ఏర్పడిన భావ వ్యక్తీకరణే భాష. వివిధ చారిత్రక, సామాజిక, ఆర్థిక, భౌగోళిక కారణాల వల్ల వ్యక్తీకరణ అనేక రకాలుగా జరుగుతుంది. భాషలో కేవలం వ్యక్తీకరణే గాక, మన సంస్కృతి కూడా దాగి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
మన భాష అంటే మాట్లాడే నాలుగు మాటలు మాత్రమే కాదని.. మన సంస్కృతిని నింపుకున్న మాతృభాష ప్రతి ఒక్కరి ఇంటి భాష కావాలన్నారు. ‘వ్యక్తిని మోక్షం దిశగా నడిపించే ఒక ఆధ్యాత్మిక మార్గం మతం. ఆ లక్ష్యం దిశగా మనిషిని ముందుకు తీసుకు వెళ్ళే జీవన విధానానికి సాధనంగా నిలిచే ఆచరణాత్మక మార్గదర్శి సంస్కృతి. భాష.. ఈ సంస్కృతిలోని అంతర్భాగం. అందుకే భాషను, సంస్కృతిని విడదీసి చూడలేము’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
ప్రతి నాగరికత గొప్పదనం వారి భాష ద్వారానే వ్యక్తమవుతుందన్న ఉపరాష్ట్రపతి.. మన ఆటలు, మాటలు, పాటలు, సంగీతం, సాహిత్యం, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు, వ్యాపార లావాదేవీలన్నీ భాష లేకుండా పెంపొందలేవన్నారు. ‘భాష సమాజాన్ని సృష్టించి.. జాతిని బలపరుస్తుంది, అభివృద్ధికి మార్గం వేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.
తెలుగు భాషాభివృద్ధి ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని.. దీనికోసం ముందుగా తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచించాలన్నారు. ‘ఇతర భాషలు నేర్చుకోవడం, ప్రావిణ్యత సాధించడం తప్పు కాదు. ఎవరైనా, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. ఆ విషయంలో ఆకాశమే హద్దు. కానీ మాతృభాషను, మాతృమూర్తిని మరచిపోకూడదు. అందుకే భాషాభివృద్ధి కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది తల్లిదండ్రుల బాధ్యత, గురువుల బాధ్యత, అన్నింటికీ మించి ఎవరికి వారే అమ్మ లాంటి మాతృభాష కోసం ముందుకు కదిలి కాపాడుకోవలసిన బాధ్యత’ అని ఉపరాష్ట్రపతి అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలనడం కంటే.. ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక తిరునాళ్లు’ అనడం సముచితంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. చిన్నప్పుడు ఊళ్లలో జరిగే తిరునాళ్లతో మన సంస్కృతిని తెలుసుకునే అవకాశముండేదని.. అదే రీతిలో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం.. భవిష్యత్ తరాలు తెలుగుభాష, సంస్కృతి ప్రాశస్త్యాన్ని తెలుసుకుని, వీటిని నేర్చుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తాయి కాబట్టి ఈ ఉత్సవాలను తిరునాళ్లు అంటే బాగుంటుందన్నారు.
భాష, సంస్కృతుల అభివృద్ధికి తానాతో సహా పలు తెలుగు సంఘాలు కలిసి చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. 8 అంశాల్లో 23 రకాల పోటీలు (సౌందర్యలహరి, తెలుగు వెలుగు, రాగమంజరి, నాదామృతం, అందెల రవళి, కళాకృతి, రంగస్థలం) నిర్వహించటం, మన సంస్కృతిని ప్రతిబింబించేలా వాటికి పేర్లు పెట్టడం చాలా చక్కని ఆలోచనన్నారు. రాష్ట్రం, దేశం అనే తేడా లేకుండా ఎల్లలు దాటి తెలుగు వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న అనేక తెలుగు సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆహ్వానించదగిన పరిణామమని ఉపరాష్ట్రపతి అన్నారు.
కరోనా నేపథ్యంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని.. సామాజిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు. దైనందిన జీవితంలో యోగ, ధ్యానాన్ని భాగం చేసుకోవాలని, తద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. ఈ ఇబ్బందితో ఆందోళన చెందవద్దని.. కరోనా సమస్యను అధిగమించవచ్చని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు సీఎం రమేశ్,గల్లా జయదేవ్,లావు కృష్ణదేవరాయ..తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి,సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,అధికార భాషాసంఘం చైర్మన్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఆంధప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, తానా అధ్యక్షుడు జై తాల్లూరి, తానా చైర్మన్ అశోక్, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ రావుతోపాటు పలువురు భాషాభిమానులు, ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!