విజిట్ వీసాల‌పై భార‌తీయులు అప్పటిదాకా యూఏఈ రావొద్దు: భారత రాయబారి

- August 04, 2020 , by Maagulf
విజిట్ వీసాల‌పై భార‌తీయులు అప్పటిదాకా యూఏఈ రావొద్దు: భారత రాయబారి

యూఏఈ: వందే భారత్ మిషన్ ద్వారా ఎందరో భారతీయులు స్వదేశానికి చేరారు. అయితే భారతదేశంలో చిక్కుకుపోయిన యూఏఈ వాసులు తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు అదే వందే భారత్ మిషన్ ద్వారా ఊరట చెందుతున్నారు.కానీ, వాలిడ్ రెసిడెన్సీ వీసా ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు దీంతో విసిట్ వీసాలు పొందిన వారి సంగతి అయోమయంలో పడిపోతోంది. దీనిపై స్పందించారు యూఏఈ లోని భారత రాయబారి పవన్ కపూర్.

ట్రావెల్ ప్రోటోకాల్‌పై స్పష్టత వచ్చేవరకు భారత పౌరులకు విజిట్ వీసాలపై ప్రయాణించడానికి అనుమతి లేదని పవన్ కపూర్ చెప్పారు. "ఈ సమయంలో యూఏఈ ప్ర‌భుత్వం ప్రజలను సందర్శన వీసాలపై త‌మ దేశానికి రావడానికి అనుమతిస్తుందో లేదో స్పష్టంగా తెలియ‌దు. ఈ విష‌యంపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నాం. అలాగే విజిట్‌ వీసాలపై ప్రయాణించడానికి పౌరుల‌ను అనుమతించాలా? వద్దా? అని భారత ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు" అని ఆయ‌న చెప్పారు. ప్రస్తుతానికి విమానయాన సంస్థలు సైతం విజిట్ వీసాతో ప్రయాణికులను తీసుకెళ్లడం లేదని ఈ సంద‌ర్భంగా రాయబారి స్ప‌ష్టం చేశారు. 

మ‌రోవైపు జూలై 29 నుంచి భారతదేశంతో సహా మరిన్ని దేశాలకు దుబాయ్ విజిట్ వీసాలు ఇవ్వడం ప్రారంభించిందని స‌మాచారం. అయితే, ఇండియాలో ఇప్పటికీ అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణాల‌పై ఈ నెల 31 వ‌ర‌కు ఆంక్ష‌లు ఉన్న‌ విష‌యం తెలిసిందే. దీంతో విజిట్ వీసాదారులు యూఏఈకి ఎలా వెళ్తారో స్పష్టత‌ లేదు. విజిట్ వీసాల‌పై యూఏఈకి వ‌చ్చి క‌ష్టాలు కొనితెచ్చుకొవ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. విజిటింగ్ వీసాల‌పై పూర్తి స్ప‌ష్ట‌త వ‌చ్చేవ‌ర‌కు భార‌త పౌరులు యూఏఈకి రాక‌పోవ‌డం మంచిద‌న్నారు పవన్ కపూర్.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com