విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- November 11, 2025
విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి, రాష్ట్రంపై చిరస్థాయి ముద్ర వేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వర్చువల్గా పాల్గొన్న, జి. సిగడాం మండలం సంత ఉరిటిలో 100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… విశాఖ సీఐఐ సదస్సు (Visakhapatnam CII Conference) కు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడించారు. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన 8 మంది స్పీకర్లు ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 37 ప్లీనరీ సెషన్లు, కంట్రీ సెషన్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుందని, ఈ సమావేశాల్లో వివిధ దేశాల ప్రతినిధులు, పలు ప్రముఖ కంపెనీల సీఎక్స్ఓలు, ఆర్థిక నిపుణులు, కేంద్ర మంత్రులు పాల్గొని వివిధ దేశాల్లో వాణిజ్యానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తారన్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాలకు సంబంధించి 410 ఒప్పందాలను కుదుర్చుకోనుందని, వీటి ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.9.76 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి శ్రీనివాసరావు తెలిపారు.
జి. సిగడాం మండలం సంత ఉరిటిలోని బయోగ్యాస్ ప్రాసెసింగ్ యూనిట్ సుమారు 100 రూపాయిల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానుందని తెలిపారు. ఈ ప్లాంట్ నిర్మాణం ద్వారా సుమారు 500 మందికి ప్రత్యక్షంగా, 1,000 మంది రైతులకు పరోక్షంగా ఉపాధి లభిస్తుందని నిర్మాణ సంస్థ ప్రతినిధి రామ్మోహన్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ మాట్లాడుతూ, ఈ ఉపాధి అవకాశాల ద్వారా యువతకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో పలాస, ఇచ్చాపురంలలో కూడా ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృధ్విరాజ్ కుమార్, శ్రీకాకుళం ఆర్డీవో కే సాయి ప్రత్యూష, డీపీఓ భారతీ సౌజన్య, తహసీల్దార్ ఎం సరిత, సంత ఉరిటి సర్పంచ్ బుడారి లక్ష్మణరావు, జి. సిగడాం ఎంపీడీవో జి రామకృష్ణ రావు, పొందూరు ఎంపీడీవో ఎస్ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









