విమాన ప్రయాణాలకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన ఒమన్ ప్రభుత్వం

- September 13, 2020 , by Maagulf
విమాన ప్రయాణాలకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన ఒమన్ ప్రభుత్వం

మస్కట్:ఒమన్ కు వచ్చే ప్రయాణికులు అందరూ ఖచ్చితంగా ఆరోగ్య బీమా తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఒమన్ లో అడుగుపెట్టిన నాటి నుంచి కనీసం నెల రోజుల పాటైనా ఇన్సూరెన్స్ గడువు ఉండాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 1 నుంచి అంతర్జాతీయ విమానాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఒమన్ పౌర విమానయాన అధికారులు ఈ మేరకు కొత్తగా మార్గనిర్దేశకాలను జారీ చేశారు. ఒమన్ కు చేరుకోగానే ప్రతి ప్రయాణికుడు విధిగా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని, ఆ తర్వాత 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుందని తెలిపారు. ఈ 14 రోజులు ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్ ధరించాల్సి ఉంటుంది. ఇక క్వారంటైన్ లో ఉండాల్సిన 14 రోజులకు సంబంధించి నివాస ఖర్చులను సదరు ప్రయాణికులే భరించాలి. అందుకు అనుగుణంగా హోటల్ బుకింగ్ వివరాలను కూడా తెలియజేయాలి. అలాగే సుల్తానేట్ కు వచ్చే ఒమనేతరులు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే కరోనా వైరస్ నేపథ్యంలో ఒమన్ నుంచి విదేశాలకు బయల్దేరే ప్రయాణికులకు సంబంధించి కూడా మార్గనిర్దేశకాలను విడుదల చేసింది. విదేశీ ప్రయాణికుడికి ఒక్క సహాకుడిని మాత్రమే డిపార్చర్ టెర్మినల్ లోకి అనుమతిస్తారు. విమానం బయల్దేరే సమయానికి కనీసం మూడు, నాలుగు గంటల ముందే విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వారిని విమానాశ్రయంలోకి అనుమతించబోమని కూడా పౌర విమానయాన అధికారులు స్పష్టం చేశారు. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com