గల్ఫ్ కార్మికుల ఆశలపై నీళ్లు చల్లిన భారత ప్రభుత్వం
- December 19, 2020
హైదరాబాద్:కొత్తగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం మూడు నెలల క్రితం రెండు సర్కులర్లు జారీ చేసింది. ఖతార్, బహ్రెయిన్, ఓమాన్, యూఏఈ దేశాలకు వెళ్లే కార్మికుల నెలసరి వేతనాలను 200 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 15 వేలు), కువైట్ (245 డాలర్లు), సౌదీ అరేబియా (324 డాలర్లు) కు తగ్గిస్తూ భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ అండ్ ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రంట్స్ డివిజన్ లోని డైరెక్టర్ స్థాయి అధికారి రాజ్ కుమార్ సింగ్ పేరిట సెప్టెంబర్ 8న, 21న రెండు వేర్వేరు సర్కులర్లు జారీ అయ్యాయి.
యూఏఈ (దుబాయ్) కి వెళ్లే కార్మికులకు వారి నైపుణ్యాన్ని, వృత్తిని బట్టి ఇటీవలి వరకు కనీస వేతనాలు 800 నుండి 1700 దిర్హామ్స్ (సుమారు రూ. 16 నుండి 34 వేలు) గా ఉండేది. ఇప్పుడు కొత్త సర్కులర్ ప్రకారం అందరినీ ఒకేగాటన కట్టి 735 దిర్హామ్స్ (సుమారు రూ. 15 వేలు) కు తగ్గిస్తూ సర్కులర్లు జారీ చేశారు.
గల్ఫ్ దేశాల ప్రభుత్వాల నుండి ఎలాంటి ప్రతిపాదన లేకున్నా భారత ప్రభుత్వం రిక్రూటింగ్ ఏజెన్సీలు, విదేశీ కంపెనీ యాజమాన్యాల లాబీకి తలొగ్గి భారత ప్రవాసి కార్మికులకు తీరని అన్యాయం చేసిందని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షులు మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు.ఎలాంటి అధ్యయనం, చర్చలు లేకుండా మూడు నెలల క్రితం గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలు తగ్గిస్తూ జారీ చేసిన సర్కులర్లను రద్దు చేసి పాత వేతనాలను కొనసాగించాలని కోరుతూ విదేశాంగ మంత్రి డా. ఎస్. జయశంకర్, బిజెపి ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీ ఎ. రేవంత్ రెడ్డి, టిఆర్ఎస్ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డిలకు శనివారం ట్వీట్ చేసినట్లు మంద భీంరెడ్డి తెలిపారు.
ఇదిలా ఉండగా, కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు ఊడిపోయి గల్ఫ్ దేశాల నుండి వాపస్ వచ్చినవారు అధిక విమాన చార్జీలు, క్వారంటైన్ చార్జీలు చెల్లించి నష్టపోయారు. యాజమాన్యాల నుండి రావలసిన జీతం బకాయిలు మరియు బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి 'ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్' (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) పొందలేక కార్మికులు ఆర్థికంగా నష్టపోయారు. 'జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్' (జీతం దొంగతనం గురించి న్యాయం చేయాలని) విదేశీ లేబర్ కోర్టులలో న్యాయ పోరాటానికి కావలసిన 'లీగల్ ఎయిడ్' (న్యాయ సహాయం) అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని భీంరెడ్డి కోరారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









