గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం...మజ్దూర్ ప్రవాసి భారతీయ దివస్
- January 07, 2021
- వేతన దొగతనం, కనీస వేతనాల తగ్గింపు పై చర్చ
హైదరాబాద్:జనవరి 9న ఢిల్లీలో భారత ప్రభుత్వం నిర్వహించనున్న 16వ 'ప్రవాసి భారతీయ దివస్' వేడుకల ఎజెండాలో గల్ఫ్ కార్మికుల సమస్యలకు చోటు కల్పించనందున వలసకార్మిక హక్కుల సంఘాలు గురువారం (07.01.2021) న హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రత్యామ్నాయంగా 'మజ్దూర్ ప్రవాసి భారతీయ దివస్' ను నిర్వహించాయి. నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్టు, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గల్ఫ్ దేశాలలో భారతీయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
భారత ప్రభుత్వం ఢిల్లీలో నిర్వహిస్తున్న 'ప్రవాసి భారతీయ దివస్' వేడుకలను సంపన్న ఎన్నారైల జాతరగా నిర్వహిస్తూ.. గరీబు గల్ఫ్ కార్మికుల సమస్యలను చర్చించడానికి అవకాశం ఇవ్వకుండా విస్మరించినందున తాము పోటీగా హైదరాబాద్ లో 'మజ్దూర్ ప్రవాసి భారతీయ దివస్' ను నిర్వహించి కార్మికుల గొంతును వినిపించామని నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్టు చైర్ పర్సన్ సిస్టర్ లిసీ జోసెఫ్ అన్నారు.
ప్రభుత్వం ఎన్నారైల పెట్టుబడులపై మాత్రమే ప్రేమ చూపుతూ ప్రవాసీల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. భారత ప్రభుత్వం గల్ఫ్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చూపుతున్న శ్రద్ధ కార్మికుల కష్టాలపై చూపడం లేదు. మానవ వనరులను ఎగుమతి చేస్తూ.. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తూ మనుషులతో ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తున్నారని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి విమర్శించారు.
కరోనా మహమ్మారి వలన విదేశాలలో ఉపాధి, జీవనోపాధి కోల్పోయిన భారతీయ వలసదారులు పెద్ద సంఖ్యలో తిరిగి వచ్చారు. స్వదేశానికి తిరిగివచ్చిన చాలామంది కార్మికులు వారి జీతం బకాయిలు, ఉద్యోగ ముగింపు ప్రయోజనాలు పొందలేక అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు.
భారతీయులు ఎక్కువగా గల్ఫ్ దేశాలలోనే నివసిస్తున్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా అత్యధికంగా ఆర్జించి పెడుతున్నారు. గల్ఫ్ నుండి తిరిగివచ్చిన వారి పునరావాసం, పునరేకీకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను రూపొందించాలని ఆయన కోరారు.
ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల కనీస వేతనాలను 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్లు లక్షలాది మంది భారతీయ కార్మికుల కలలను కల్లలు చేసినవి. వేతన తగ్గింపు సర్కులర్లను వెంటనే రద్దు చేయాలని మైగ్రంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు కోటపాటి నరసింహం నాయుడు డిమాండ్ చేశారు. కార్మికుల కష్టార్జితం నుండి లాభం పొందుతన్న ప్రభుత్వాలు వారి సంక్షేమానికి కృషి చేయకుండా తీవ్రంగా నష్టపరుస్తున్నాయని ఆయన అన్నారు.
గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది వలసకార్మికులు, గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన మరో 30 లక్షల మంది సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం "గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు" ఏర్పాటు చేయాలని పలువురు వక్తలు కోరారు. ఈ బడ్జెట్ సమావేశాలలో చట్టం చేసి "గల్ఫ్ బోర్డు" ఏర్పాటు చేసి రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు. గల్ఫ్ దేశాలలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్ధిక సహాయం చేయాలని కోరారు. వేముల రమేష్, గంగుల మురళీధర్ రెడ్డి, బిఎల్ సురేంద్రనాథ్ తదితరులు ప్రసంగించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







