'వంశీ ఇంటర్నేషనల్' ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం
- February 10, 2021
'వంశీ ఇంటర్నేషనల్' ఆధ్వర్యంలో ఈ నెల 7,8,9 తారీకులలో సద్గురు త్యాగరాజ స్వామి స్మృతిలో, వారి కృతులపై విశ్లేషణాత్మక ప్రసంగాలతో అంతర్జాలం ద్వారా ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించబడింది.

సంగీత సారస్వతమూర్తి అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ తాడేపల్లి లోకనాధ శర్మ మూడు రోజులపాటు త్యాగరాజ స్వామి కృతులను పాడుతూ, వాటిలోని సాహిత్య ఆధ్యాత్మిక విలువలను సోదాహరణంగా వివరిస్తూ, ఈ తరం వారికి తెలియని ఎన్నో విషయాలను సూచనలను అందజేశారు. ఈ కార్యక్రమానికి సేవారత్న శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు అధ్యక్షత వహించగా, రచయిత్రి రాధిక మంగిపూడి సమన్వయకర్తగా వ్యవహరించి నిర్వహించారు.

డా.లోకనాథశర్మ మాట్లాడుతూ "సంగీతం అనేది భావప్రధానమైనదని, పాటలోని సాహిత్యాన్ని ఆకళింపు చేసుకొని భావానుగుణంగా రాగాలాపన చేయాలని, ముఖ్యంగా త్యాగరాజస్వామి కృతులలో ఆసాంతం నిండియున్న భక్తితత్వాన్ని అర్థం చేసుకోకుండా ఆ కృతులను కేవలం సంగీత పరిజ్ఞానంతో పాడడం వలన ప్రయోజనం ఉండదని" తెలుపుతూ, యువ కళాకారులందరికీ మార్గదర్శకంగా ఉండేలా కొన్ని కృతులను ఎలా పాడాలో, ఎలా పాడకూడదో కూడా చెబుతూ ఆలపించి వినిపించారు.
ఈ కార్యక్రమంలో మొదటిరోజు అమెరికా నుండి ప్రముఖ రచయిత్రి డాక్టర్ సొంఠి శారదాపూర్ణ, రెండవ రోజు సింగపూర్ నుండి "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, మూడవరోజు హంకాంగ్ నుండి "హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య" అధ్యక్షురాలు జయ పీసపాటి విచ్చేసి తమ అమూల్యమైన ప్రసంగాలను అందించారని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి "విజయీభవ ట్రస్ట్" యూట్యూబ్ ఛానల్ వారు సాంకేతిక సహకారం అందించి మూడు రోజులపాటు ప్రత్యక్ష ప్రసారాన్ని అందించగా, డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు, ప్రముఖ గాయకులు గరికిపాటి ప్రభాకర్, గాయని శశికళ స్వామి, డాక్టర్ ప్రభల జానకి, అమెరికా నుండి పరిటి రాజేశ్వరి, రాధిక నోరి తదితర ప్రముఖులు కూడా విచ్చేసి తమ అమూల్యమైన స్పందనలను తెలియజేశారు.
తాజా వార్తలు
- తెన్నేటి సుధా రామ రాజు పేరిట లక్ష రూపాయల సాహితీ పురస్కారం ప్రకటింపు
- షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా స్ట్రీట్ మూసివేత..!!
- E311లో ప్రమాదం.. డ్రైవర్ స్పృహ కోల్పోవడమే కారణం..!!
- వేటగాళ్ల నుండి సీగల్స్ కు విముక్తి..!!
- షురా కౌన్సిల్ లో లాంగ్ టెర్మ్ కల్చరల్ వీసాపై చర్చ..!!
- ఖతార్ లో త్వరలో ఇళ్ల వద్దకే రేషన్ డెలివరీ..!!
- రియాద్లో ఆరుగురు పాకిస్తానీలు అరెస్టు..!!
- దుబాయ్లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు







