కోవిడ్ నియంత్రణలో కీలక చర్యలు చేపట్టిన హైదరాబాద్ విమానాశ్రయం

- April 30, 2021 , by Maagulf
కోవిడ్ నియంత్రణలో కీలక చర్యలు చేపట్టిన హైదరాబాద్ విమానాశ్రయం

హైదరాబాద్: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండగా, ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రతి రాష్ట్రం పూర్తి స్థాయిలో పోరాడుతోంది. వైరస్ కట్టడికి అనేక రాష్ట్రాలు మళ్ళీ లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. 

ఈ మహమ్మారిపై పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించడంతో పాటు మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటివి పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు.

కోవిడ్ వ్యాప్తిని నివారించే లక్ష్యంతో, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించే వారికి తెలంగాణ ప్రభుత్వం రూ .1,000 (రూ. వెయ్యి మాత్రమే) జరిమానా విధించే ఆదేశాలను జారీ చేసింది.

అయితే, కోవిడ్  మహమ్మారి మధ్య సవాళ్లను ఎదుర్కొంటున్న పోలీసు శాఖలో ఉద్యోగుల కొరత దృష్ట్యా, తెలంగాణ రాష్ట్ర డిజిపి, విమానాశ్రయంలో ప్రయాణీకులు అన్ని సమయాల్లో మాస్క్ ధరించి ఉండేలా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడానికి విమానాశ్రయ అధికారులకు అధికారం ఇచ్చారు. దీని ప్రకారం, కోవిడ్-19 భద్రతా మార్గదర్శకాలను అమలు చేయడానికి మరియు సహాయపడటానికి 20 మంది GHIAL అధికారులను ప్రత్యేక పోలీసు అధికారులుగా (SPO) నియమించారు. విమానాశ్రయ ప్రాంగణంలో కోవిడ్ -19 భద్రతా మార్గదర్శకాలను పాటించని ప్రయాణీకులు, సందర్శకులు మరియు సిబ్బందికి జరిమానా విధించే అధికారం మాత్రమే ఈ ప్రత్యేక అధికారులకు ఉంటుంది.

ఇటీవల SHO, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీస్ స్టేషన్, శంషాబాద్, ఇతర సైబరాబాద్ పోలీసు అధికారులు ఈ SPOలకు శిక్షణ ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ వాడకం, ఈ-చలాన్ జనరేషన్ చేసే విధానంపై వారికి శిక్షణ ఇచ్చారు. ప్రారంభంలో, GHIAL అధికారులు సైబరాబాద్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తారు. SPOల నియామక ఉత్తర్వు మే1 నుంచి, జూలై 31 వరకు అమలులో ఉంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com