మనసే సాక్షి

- June 02, 2015 , by Maagulf
మనసే సాక్షి

 

వయసు మీద పడుతున్నకొద్దీ

మనిషికి మృత్యు భయం

మొదలవుతుంది

చుట్టూ ప్రకృతి ఉన్నా

మనిషి దాని నుండి

పాఠాలు నేర్చుకోడు

 

తెల్లని మబ్బు

నల్లగా మారి

బరువెక్కి వర్షించి

తేట పడుతుంది

తన ధర్మాన్ని

తాను నేరవేర్చానని

సంతృప్తి పడుతుంది

 

చెట్టు మొక్కగా

మొదలై

మహా వృక్షంగా

శాఖోపశాఖాలుగా 

విస్తరిస్తుంది

 

తొలిరోజుల్లో

నీటికోసం ఆర్తి చెందినా

బలాన్ని పుంజుకున్నాక

గాలి వేగాన్ని

జడి వానల్నీ

తట్టుకుంటుంది

చేతనైనంత మేరకు

ప్రపంచానికి

సేవ చేస్తుంది

 

కాయలనూ

పండ్లనూ

విరగకాసి

అడగకుండానే

ఇస్తుంది

రాళ్ళు విసిరిన

చేతులకు కూడా

గాయపడిన

ఫలాలని అందిస్తుంది

 

ఒంటిని వలిచి

బెరడును ఇస్తుంది

కొమ్మలపై

పిల్లలకూ పక్షులకూ

సేద చేకూరుస్తుంది

 

వయసు మళ్ళాక

శక్తి ఉడిగాక

ఖరీదైన కలపగా

జీవితాన్ని

సార్ధకం చేసుకుంటుంది

 

మనిషి మాత్రం

తన కోసమే

బ్రతుకుతాడు

'తన' వలయంలోనే

తనువు చాలిస్తాడు

 

దీర్ఘ నిద్ర

మాట సరే!

ప్రతిరాత్రీ

నిదురిస్తాడుకదా!

 

తానెవరికైనా

ఆ రోజున మంచి చేశాడా?

అలా అని ఆలోచించాడా?

 

ప్రకృతి ధర్మమైన

వార్ధక్యాన్ని మృత్యువునీ

ఎందుకు నిరసిస్తాడు?

 

భగవంతుడిని

పూజించాడో లేదో!

వదిలేద్దాం!

ఆఖరి క్షణాలలోనైనా

సాటి మనిషికి

సాయం పడితే

ఆ ఆఖరి క్షణాలు

అతన్ని గురించి

మంచి జ్ఞాపకాలుగా

మిగిలిపోతాయికదా!

 

 

                                          --- డా|| మాదిరాజు రామలింగేశ్వర రావు, మచిలీపట్నం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com