గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యములో బాలల దినోత్సవం

- November 16, 2021 , by Maagulf
గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యములో బాలల దినోత్సవం

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తముగా వున్న 65 కు పైగా తెలుగు సంఘాల భాగస్వామ్యముతో 25 దేశాలలోని తెలుగు పిల్లలతో ఘనంగా వర్చువల్ పద్దతిలో 12 గంటలపాటు నిర్విరామంగా పూర్తిగా "బాలల చేత - బాలల కోసం" బాలల దినోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తమ సందేశాన్ని పంపించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందచేసే క్రమంలో ముందుగా మన కట్టు, బొట్టు, ఆట, పాట, పండుగలు, పబ్బాలను పిల్లలకు పరిచయం చేయాలని...దానికి బాలల దినోత్సవం లాంటి సందర్బాన్ని వినియోగించ్కోవటం సంతోషం అన్నారు. ముఖ్యముగా మన సంస్కృతికి మూలమైన మాతృ భాషను పిల్లలకు నేర్పించాలని మన శతక పద్యాలు, కథలు వారికి తెలియచేయాలని అన్నారు. ఈ కార్యక్రమ స్పూర్తితో భవిష్యత్తులో మరిన్ని సంస్థలు విద్యార్దులను మనవైన విలువలతో తీర్చిదిద్దే విధంగా ముదుకు సాగాలని కోరుతూ నిర్వాహకులకు అభినందనలు తెలియచేస్తూ పిల్లలందరికి ఆశీస్సులు అందచేశారు.  
ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ఆంధ్రప్రదేష్ రాష్ట్ర మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ గారు ప్రసంగించారు.ఈ కార్యక్రమములో 300 మందికి పైగా వివిధ దేశాలలో ఉంటున్న తెలుగు పిల్లలు ప్రదర్శించటం చాలా కన్నుల పండుగగా ఉందన్నారు. ఇలాంటి పిల్లల పండుగను నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియచేశారు. మరొక అతిధిగా పాల్గొన్న గుమ్మడి గోపాల కృష్ణ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నా కాని మన సంస్కృతి సంప్రదాయాలు, బాషను మర్చిపోకుండా పూర్తిగా పిల్లలతో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించటం సంతోషమన్నారు.. వారి ప్రదర్శనలను తిలకించి మైమరచి పోయానన్నారు. మరొక అతిధిగా విచ్చేసిన వంశీ ఇంటర్నేషనల్ అధినేత రామరాజు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లలతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం అందునా అన్నిరకాల ప్రదర్శనలు చేయటం చాలా సంతోషమన్నారు. ఇంకా  అతిదులుగా మారిషస్ నుండి ప్రముఖ వ్యక్తి సంజీవ నరసిమ్హ అప్పడు గారు, మలేసియా తెలుగు సంఘం అధ్యక్షులు డాక్టర్ ప్రతాప్ గారు, సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు రత్నకుమార్,శుబోదయం ఇంఫ్రా చైర్మన్ లక్ష్మి ప్రసాద్ గారు, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గారు పాల్గొన్నారు.
కార్యక్రమ నిర్వాహకులు కుదరవల్లి సుధాకర రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన 65 తెలుగు సంఘాల అధ్యక్షులకు, ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియచేశారు.ఈ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లల కోసం రెండు వయస్సుల గ్రూపులవారికి అంటే 5 నుండి 10 మరియు 11 నుండి 16 సంవత్సరాల వయస్సు వారికి నిర్వహించిన క్యిజ్ పోటీల విజేతలని ప్రకటించారు. ఇంతటి భారీ కార్యక్రమానికి రూపకల్పన మరియు నిర్వహణలో అన్నివిధాల తనతో ఉండి ఈ విజయంలో ముఖ్యపాత్రను పోషించిన విక్రం సుఖవాసి కి, వెంకప్ప భాగవతుల కి, ప్రదీప్ కుమార్ కి, ఎం.బి. రెడ్డి కి మరియు గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య లోని భాగస్వామి సంఘాల అధ్యక్షులకు, వారి కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియచేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ గా స్విఫ్ లెర్న్ సంస్త వారు, ప్లాటినం స్పాన్సర్ గా శుబోదయం ఇంఫ్రా వారు, గోల్డ్ స్పాన్సర్ గా కుదరవల్లి ఫౌండేషన్ వారు ఉండి తమ సహయాన్ని అందించారు.అలాగే మీడియా పార్టనర్స్ గా కువైట్ అంధ్రా, మాగల్ఫ్ వారు వ్యవహరించగా సంకేతిక సహకారాన్ని సింగపూర్ సంస్థ ఆర్కే మీడియా వారు అందించారు.
తెలుగు సంఘాల ఐఖ్య వేదిక కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు, సౌది తెలుగు అసోషియేషన్ అధ్యక్షురాలు దీపిక రావి, తెలుగు కళా సమితి ఓమన్ అధ్యక్షులు అనిల్ కుమార్ కడించెర్ల, ఆంధ్ర కళా వేదిక ఖతార్ అధ్యక్షులు సత్యనారణ మలిరెడ్డి, ఫుజైరా తెలుగు కుటుంబాలు అధ్యక్షులు వేద మూర్తి, తెలుగు తరంగిణి రాస్ అల్ ఖైమా అధ్యక్షులు వెంకట సురేష్ గారు  పిల్లలు జీవితంలో అలవర్చుకోవలసిన వివిధ అంశాలైన క్రమశిక్షణ, నిజాయితీ, నిజం, ఆత్మ విశ్వాసం, సానుకూల దృక్పథం, సహాయం చేయడం, జ్ఞానము, ఏకాగ్రత లాంటి పిల్లలకు ప్రేరణ కలిగించే అంశాలమీద ప్రసంగించి వారిని ఉత్తేజ పరిచారు. ఈ 12 గంటల కార్యక్రమానికి ప్రతేక ఆకర్షణ పిల్లలే వ్యాక్యాతలుగా ఉండటం మరియు పిల్లలచే వివిధ అంశాలమీద చర్చా వేదికలు, ప్రసంగాలు చేయించటం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com