డ్రగ్స్ కేసులో సహకరించకపోతే కఠిన చర్యలు... అమెజాన్ను హెచ్చరించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
- November 19, 2021
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి మధ్యప్రదేశ్కు అమెజాన్లో గంజాయి తరలించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్లో ఓ దాబాపై స్థానిక పోలీసులు దాడి చేస్తే 20 కిలోల గంజాయి బయటపడింది. ఆరా తీస్తే అమెజాన్ ద్వారా విశాఖపట్నం నుంచి గంజాయి సరఫరా అయినట్టు తేలింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇ-కామర్స్ వెబ్సైట్ ద్వారా గంజాయి సరఫరా చేసిన వ్యవహారంపై విచారణకు సహకరించకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని అమెజాన్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ను హెచ్చరించింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం.
"గంజాయి తరలించడానికి అమెజాన్ను ఉపయోగించుకోవడం చాలా తీవ్రమైన విషయం. మేము కంపెనీ అధికారులను పిలిచాం. కానీ వాళ్లు సహకరించడం లేదు. వాళ్లు సహకరించకపోతే మేము వారిని అరెస్ట్ చేస్తాం. ఇలాంటి చర్యలను మేము అంగీకరించం. అందుకే దర్యాప్తుకు సహకరించాలని మేము కంపెనీ అధికారులను కోరుతున్నాం. లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటాం."
— నరోత్తమ్ మిశ్రా, మధ్యప్రదేశ్ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి

మధ్యప్రదేశ్లోని భింద్ పోలీసులు వారం క్రితం డ్రగ్ పెడ్లర్స్ని అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తే విశాఖపట్నం నుంచి అమెజాన్ ద్వారా గంజాయి తరలివచ్చినట్టు తేలింది. సరుకు వచ్చిన తర్వాత నగదు ఇచ్చినట్టు ఒప్పుకున్నారు. అమెజాన్లో సెల్లర్గా రిజిస్టర్ అయిన ఓ కంపెనీ 12 ప్రాంతాలకు గంజాయి సరఫరా చేసినట్టు తేలిందని మధ్యప్రదేశ్ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఈ వ్యవహారంలో అమెజాన్ అధికారులు దోషులని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విశాఖపట్నం నుంచి గంజాయి రవాణా చేసిన కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. స్టీవియా ఆకుల లాగా గంజాయిని ప్యాక్ చేసి పార్శిల్ పంపించారని మిశ్రా తెలిపారు. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ విషయంలో ఎలాంటి రూల్స్, గైడ్లైన్స్ లేవని, ఇ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా ఆయుధాలను కూడా సరఫరా చేయొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ షాపింగ్ సైట్స్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నియమనిబంధనల్ని రూపొందిస్తోందని అన్నారు. ఈ వ్యవహారంపై అమెజాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఏజెన్సీలో గంజాయి స్మగ్లింగ్పై చాలాకాలంగా విమర్శలు ఉన్నాయి. గంజాయి స్మగ్లర్లు అమెజాన్ ద్వారా సరుకు రవాణా చేస్తున్న ఘటన బయటపడటం కలకలం రేపుతోంది. అమెజాన్లో డ్రై స్టీవియా పేరుతో ప్రొడక్ట్ లిస్ట్ చేసి గంజాయిని రవాణా చేస్తున్నట్టు తేలింది. విశాఖపట్నం నుంచి ఎక్కడెక్కడికి సరుకు రవాణా అయిందో, ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరగనుందో చూడాలి.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









