జనరల్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం : అమరుడైన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్

- December 15, 2021 , by Maagulf
జనరల్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం : అమరుడైన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్

న్యూఢిల్లీ : తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి, చికిత్స పొందుతున్న భారత వాయు సేన (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బుధవారం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ హెలికాప్టర్‌  ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 14కు చేరింది. ఈ వివరాలను ఐఏఎఫ్ బుధవారం ట్విటర్ వేదికగా వెల్లడించింది. 

ఐఏఎఫ్ ఇచ్చిన ట్వీట్‌లో, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అమరుడైనందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన 2021 డిసెంబరు 8న తమిళనాడులోని కూనూరు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారని  తెలిపింది. వరుణ్ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని ప్రకటించింది. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలిపింది. 

డిసెంబరు 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హెలికాప్టర్లో ప్రయాణించినవారిలో కేవలం వరుణ్ సింగ్ మాత్రమే తీవ్రంగా కాలిన గాయాలతో బెంగళూరులో చికిత్స పొందారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com