రిలయన్స్ 4500 నిమిషాల ఫ్రీకాల్స్!

- March 30, 2016 , by Maagulf
రిలయన్స్ 4500 నిమిషాల ఫ్రీకాల్స్!

 ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో త్వరలోనే దేశవ్యాప్తంగా తన 4జి టెలికాం సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. గత మూడునెలలుగా రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులు, వారి స్నేహితులు వినియోగిస్తున్న ఈ జియో సిమ్‌ను త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇప్పటికే రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌కు సిమ్ కార్డులు కూడా పంపించినట్టు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ స్విస్ తెలిపింది.రూ. 200 ఖరీదు చేసే ఈ సిమ్ ద్వారా 75జీబీ 4జి డేటాతో పాటుగా 4500 నిమిషాలు ఫ్రీ కాల్స్ ఆఫర్ ఇస్తోంది. అయితే ఈ సిమ్ కార్డు అమ్మకాలు ఎప్పటి నుంచి.. టారిఫ్ వివరాలేంటనే వివరాలు ఒక్కసారి చూద్దాం.రిలయన్స్ జియో 4జి సిమ్ కార్డు ధర ప్రారంభంలో రూ. 200 ఉంటుంది. ఖాతాదారులు మూడు నెలల పాటు ఈ సిమ్ ద్వారా ఉచితంగా వాయిస్, డేటా సేవలు పొందవచ్చు. ఈ సిమ్ కొన్నవారికి మొదటి మూడు నెలలు దాదాపు 75 జిబి 4జీ డేటా, అలాగే 4500 నిమిషాల పాటు మాట్లాడుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. లాంచింగ్ ఆఫర్‌గా ఇస్తున్న ఈ సేవలు మూడునెలల పాటు చెల్లుబాటవుతాయి. మరి తర్వాత టారిఫ్‌ల పరిస్థితి ఏమిటన్న దానిపై కంపెనీ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఈ ఆఫర్ రిలయన్స్ హ్యాండ్ సెట్లు కొన్నవారికే ఉంటుందా.. లేక 4జి సేవలను సపోర్టు చేసే ఇతర మొబైల్స్ ఉన్నవారికీ ఈ అవకాశం అందుబాటులో ఉంటుందా అన్నదానిపై స్పష్టత లేదు.జియో సిమ్ స్టాక్ లు ఇప్పటికే తమకు చేరాయని, కానీ ఎప్పటినుంచి అమ్మకాలు ప్రారంభించేదీ తమకు సమాచారం లేదని సిబ్బంది అంటున్నారు. ముంబైలో స్టోర్లలో సిబ్బందికి, వినియోగదారుల నమోదు డాక్యుమెంటేషన్ తదితరాలపై ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్టు క్రెడిట్ స్విస్ తెలిపింది. జియో సిమ్ ల ప్రభావం భారతి ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ లాంటి భారత టెలికం ప్రత్యర్థులపై భారీగానే పడనుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com