ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ...రాజీనామాలు చేసిన మంత్రులు

- April 07, 2022 , by Maagulf
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ...రాజీనామాలు చేసిన మంత్రులు

అమరావతి: ఏపీ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. అంతకుముందు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వైఎస్సార్ సున్నావడ్డీ పథకానికి.. మిల్లెట్ మిషన్ 2022-23 నుంచి అమలు చేసేందుకు అంగీకారం తెలియజేసింది. విద్య, వైద్, ప్రణాళిక శాఖల్లో నియామకాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 

2019లో జగన్ తన మంత్రివర్గం ఏర్పాటు చేసే సమయంలో ప్రస్తుతం ఉన్న మంత్రులను రెండున్నర ఏళ్లపాటు కొనసాగిస్తానని ప్రకటించారు. రెండున్నర ఏళ్ల తర్వాత కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకొంటానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గం కూర్పు చేయనున్నారు. అయితే ఐదు డిప్యూటీ సీఎంలు కూడా కొనసాగనున్నారు. అదే సమయంలో కొత్త జిల్లాలకు కూడా ప్రాధాన్యత దక్కనుంది.

గత మాసంలో నిర్వహించిన వైసీపీ శాసనసభపక్షం సమావేశంలో మంత్రివర్గం పునర్వవ్యస్థీకరణ గురించి కూడా జగన్ ప్రకటించారు.గత మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ విషయమై మంత్రులతో కొంతసేపు సీఎం జగన్ చర్చించారు. అయితే కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరు వస్తారు, ప్రస్తుతం ఉన్న వారిలో ఇంకా మంత్రివర్గంలో ఎవరు కొనసాగుతారనే విషయమై మంత్రుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత మంత్రులు మంత్రివర్గ సమావేశానికి హాజరు కావడానికి ముందే తమ ఛాంబర్లలో ఫైల్స్ క్లియర్ చేశారు. మంత్రుల రాజీనామాలను జీఏడీ.. గవర్నర్ కార్యాలయానికి పంపనుంది. ఈ నెల 6వ తేదీనే సీఎం జగన్ గవర్నర్ మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ గురించి సమాచారం ఇచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com