వలస కార్మికులకు పిసిసి ప్రక్రియ వేగవంతం చేస్తూ స్లాట్ల సంఖ్య పెంచాలి:వెంకట్ మేడపాటి
- April 22, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పిసిసి) పొందే విషయంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ విజయవాడ మరియు విశాఖపట్టణం రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్.మేడపాటి లేఖ వ్రాశారు.ఉపాధి మరియు చదువుల నిమిత్తం విదేశాలు వెళ్లాలనుకునే వలస కార్మికులకు మరియు విద్యార్థులకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (ఇమ్మిగ్రేషన్ కొరకు తప్పక ఉండవలసిన పత్రం) మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయవలసిందిగా లేఖలో పేర్కొన్నారు.అలాగే పిసిసి స్లాట్ల కేటాయింపును పెంచవలసిందిగా మరియు పిసిసి తత్కాల్ కోటాలు ప్రవేశపెట్టాలని కోరారు.
కోవిడ్ 19 సమయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వలస కార్మికులు మరియు విద్యార్థులు వేలాది సంఖ్యలో తమ స్వస్థలాలకు తిరిగొచ్చారని, ఇప్పుడు కోవిడ్ ప్రభావం తగ్గడంతో ఎక్కువ సంఖ్యలో తిరిగి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారని తెలిపారు.అలా తిరిగి వెళ్లాలనుకునే వలస కార్మికులు, విద్యార్థులు మరియు కొత్త వీసాలపై విదేశాలకు వెళ్లాలనుకునే వారు పిసిసి నమోదు ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు APNRTS దృష్టికి రావడంతో స్లాట్ల సంఖ్య పెంచాలని కోరడం జరిగింది.
గల్ఫ్ దేశాలు ప్రస్తుతం 3 నుంచి 6 నెలల వ్యవధి గల అతితక్కువ కాలం చెల్లుబాటయ్యే వీసాలు జారీ చేసి వలసకార్మికులను వెంటనే పనిలో చేరమని సూచనలు చేయడం, అలాగే విదేశీ యూనివర్శిటీలు విద్యార్దులను శిక్షణా తరగతులకు త్వరితగతిన హాజరు కావలసిందిగా తెలిపాయన్నారు.పిసిసికి నమోదు చేసుకున్న వారు ఈ సర్టిఫికేట్ పొందుటకు కనీసం 45 రోజుల సమయం పడుతుండడంతో కార్మికులు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం,విద్యార్ధులు హాజరు మరియు శిక్షణా తరగతులకు సకాలంలో వెళ్ళలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకొని అక్రమ ఏజెంట్లు డూప్లికేట్ పిసిసి లు ఇస్తున్నారని,వీటి కారణంగా విదేశాల్లో వర్క్ పర్మిట్లు పొందుటకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
వలస కార్మికులకు,వారి కుటుంబ సభ్యులకు మరియు విద్యార్దులకు సహాయపడేలా పిసిసి స్లాట్స్ కోటాలు పెంచడం, మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఆఫీసర్ (ఇంటర్నేషనల్ కో ఆపరేషన్) గీతేష్ శర్మ, IFS (రిటైర్డ్) విదేశాంగ మంత్రిత్వ శాఖ–జాయింట్ సెక్రటరీ (పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్) మరియు చీఫ్ పాస్పోర్ట్ ఆఫీసర్ ఆర్మ్స్ట్రాంగ్ చాంగ్సన్ ని కూడా కలవడం జరిగిందని తెలిపారు.
వలస కార్మికుల ఉపాధి మరియు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పిసిసి స్లాట్లు పెంచమని, అలాగే ఇప్పుడున్న పిసిసి ప్రక్రియ వేగవంతం చేయాలని మేడపాటి కోరారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







